పాడి పశువుల నుంచి కోట్ల ఆర్థిక వృద్ధి..
రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు..
ఆంధ్రప్రదేశ్లో పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో మార్గనిర్దేశం చేయడానికి “పశుసంవర్ధక మార్గదర్శిని” అనే ఈ-మేగజైన్ను రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు పాడి పశువులు, చిన్న జీవాలు, నాటు కోళ్ల పెంపకంతో అనుబంధంగా ఉన్నారని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఈ రంగం ద్వారా రూ.1,76,151 కోట్ల స్థూల విలువ వృద్ధి నమోదవడం పశుసంవర్ధక రంగ ప్రాధాన్యతను చూపిస్తోందన్నారు. అయితే సంప్రదాయ పద్ధతులు, కూలీల కొరత, పశుగ్రాసాల లోపం, పెరుగుతున్న దాణా ఖర్చులు వంటి సమస్యలు వృద్ధికి అడ్డంకులుగా మారుతున్నాయని చెప్పారు.
ప్రస్తుతం యువత సాంకేతిక రంగాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, పశుసంవర్ధక రంగంలో వాణిజ్య అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని మంత్రి సూచించారు. పాడి పశువులు, నాటు కోళ్లు, పందుల పెంపకం వంటి రంగాల్లో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విశాఖపట్నంలోని రాష్ట్ర పశుగణ యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల వ్యవస్థాపక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1500 మంది శిక్షణ పొందగా, అందులో 200 మంది రైతులు వాణిజ్యపరంగా విజయవంతంగా తమ వ్యాపారాలను ప్రారంభించారని వెల్లడించారు.
రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఈ-మేగజైన్ను ఏప్రిల్ నెల నుంచి “స్మైల్” వెబ్సైట్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అందుబాటులో ఉంచారు. ఇందులో పశు ఆరోగ్యం, పోషణ, పునరుత్పత్తి, యాజమాన్యం, మార్కెటింగ్, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై సమగ్ర సమాచారం, నిపుణుల సూచనలు, విజయగాథలు అందిస్తారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే పశుసంవర్ధక సహాయకులు, గోపాల మిత్రులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరవేయడంలో ఈ మేగజైన్ ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.
పశుసంవర్ధక రంగాన్ని సేంద్రియ, వాణిజ్య పద్ధతుల్లో అభివృద్ధి చేస్తే ఒక్క ఎకరం నుంచి సంవత్సరానికి రూ.5 నుంచి 6 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముందని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించినట్లుగా ప్రతి ఇంట్లో ఒక ఎంట్రప్రెన్యూర్ ఏర్పడి, రైతుల ఆదాయం పెరగడమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డా. వై. సింహాచలం, జాయింట్ డైరెక్టర్ డా. బైరాగి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.