జాతీయ స్థాయిలో మెరిసిన ఏపీ టూరిజం.. ప్రతిష్టాత్మక అవార్డు కైవసం..
కేరళలో జీటీఎం టూరిజం అవార్డు అందుకోనున్న మంత్రి కందుల దుర్గేష్..
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పోగా పేరొందిన ‘గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026’ ఆంధ్రప్రదేశ్ను “బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్”గా ఎంపిక చేయడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించేందుకు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జూన్ 3 నుంచి 5 వరకు కేరళ పర్యటనకు బయలుదేరారు.
తిరువనంతపురంలో నిర్వహించనున్న జీటీఎం ఎక్స్పో-2026 కార్యక్రమాల్లో మంత్రి దుర్గేష్ పాల్గొననున్నారు. జూన్ 3న కోవాలంలోని ‘ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్ అండ్ స్పా’లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం జూన్ 4న ‘గోల్డెన్ ప్యాలెస్ కన్వెన్షన్ సెంటర్’లో నిర్వహించే ప్రధాన ఎక్స్పో సమావేశాల్లో పాల్గొంటారు.
అదే రోజు సాయంత్రం కోవాలంలోని ‘లీలా తిరువనంతపురం రావిజ్ హోటల్’లో జరిగే జీటీఎం అవార్డ్స్-2026 వేడుకలో దేశ విదేశాల ప్రముఖుల సమక్షంలో “మెట్రో ఎక్స్పెడిషన్ – GTM టూరిజం అవార్డు 2026”ను మంత్రి దుర్గేష్ స్వీకరించనున్నారు. అనంతరం జూన్ 5న తిరువనంతపురం నుంచి ముంబయి పర్యటనకు బయలుదేరనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దార్శనికతతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర పర్యాటక శాఖ అంతర్జాతీయ స్థాయిలో చేసిన కృషికి దక్కిన గుర్తింపే ఈ అవార్డు అని ఆయన పేర్కొన్నారు. పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట మరియు అధికారుల బృందం చేసిన కృషిని ఆయన అభినందించారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన టూరిజం పాలసీ 2024-29, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, అనుబంధ విధానాలు, డిజిటల్ ప్రమోషన్లు మరియు ‘బ్రాండ్ ఏపీ’ ప్రచార కార్యక్రమాలు ఈ విజయానికి కారణమయ్యాయని మంత్రి తెలిపారు. సోషల్ మీడియా, అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక సౌందర్యాన్ని వినూత్నంగా పరిచయం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరిగిందన్నారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఏడాది పొడవునా పర్యాటక ఉత్సవాలు నిర్వహించడం, సృజనాత్మక ఆలోచనలతో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం వల్లే ఏపీకి ఈ గౌరవం దక్కిందని ఆయన చెప్పారు. కేరళలో అందుకోబోయే ఈ అవార్డు ఏపీ పర్యాటక రంగ విజయాలకు ముగింపు కాదని, ప్రపంచ స్థాయి విజయాలకు ఇది ఒక గొప్ప ఆరంభమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిజం బోర్డులు, హాస్పిటాలిటీ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొనే ఈ ఎక్స్పో ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులు, పర్యాటక అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.