ఖతర్ దేశంలో మత ప్రచారం నిర్వహిస్తున్నారనే అభియోగంపై పోలీసులు అదుపులోకి తీసుకున్న తెలుగు పాస్టర్లకు ఊరట లభించింది. అరెస్టయిన వారిలో తొమ్మిది మంది స్ధానిక ప్రవాసీయులు కాగా.. మరో ముగ్గురు మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా ఖతర్ వచ్చారు. దీంతో దేశం విడిచి వెళ్ళకుండా ఈ ముగ్గురిపై గతంలో నిషేధాన్ని విధించారు. కానీ ఆ నిషేధాన్ని తొలగించడంతో ఈ ముగ్గురు ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని వారి వారి స్వస్ధలాలకు చేరుకోన్నారు. పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలకు చెందిన ఈ ముగ్గురు పాస్టర్లుగా ఉన్నారు.
అయితే వీరిలో ఇద్దరు చర్చి వార్షికోత్సవ సభలో పాల్గొనేందుకు రాగా.. మరొకరు వ్యక్తిగత కార్యక్రమం కోసం ఖతర్ వచ్చారు. ఏప్రిల్ 27వ తేదీన చర్చిలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గనేందుకు వీరు వెళ్తుండగా వీరిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం జులై 4 న వారిని విడుదల చేశారు. కానీ దేశం విడిచి వెళ్లకుండా వీరిపై ఆంక్షలు విధించారు.భారతీయ రాయబారి కార్యాలయం ద్వారా వీరు జైలు నుంచి విడుదల అయ్యారు.
అనంతరం ఈ పాస్టర్లు మాట్లాడుతూ.. తాము ఏ రకమైన మత ప్రచారం నిర్వహించేందుకు ఖతర్ రాలేదన్నారు. కేవలం చర్చి వార్షికోత్సవం కోసం ఈ దేశానికి వచ్చినట్లు వారు వివరించారు. తమకు ఖతర్ చట్టాలపై పూర్తి గౌరవం ఉందన్నారు. ఈ సందర్భంగా ఖతర్ ప్రభుత్వంతోపాటు అక్కడి భారతీయ రాయబార కార్యాలయ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        