SCR Recruitment 2026: పదో తరగతి చదివి ఖాళీగా ఉంటున్నారా రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది ఒక చక్కని అవకాశం. దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో వివిధ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న 2,801 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల ప్రత్యేకత ఏమిటంటే, ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం అకడమిక్ మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఎస్ అండ్ టీ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్ వంటి పలు ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దాంతో పాటు సంబంధిత ట్రేడ్లో ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ ఇతర రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 11, 2026 లోపు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను పదో తరగతి ఐటీఐలో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ ప్రాతిపదికన తయారు చేస్తారు. ఎక్కడా ఇంటర్వ్యూ లేదా పరీక్షా హడావుడి లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఉన్న రైల్వే యూనిట్లలో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు ప్రతి నెలా స్టైపెండ్ కూడా అందుతుంది. రైల్వే నిబంధనల ప్రకారం ఈ స్టైపెండ్ ఉంటుంది. అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో రైల్వేలో వచ్చే గ్రూప్-డి ఉద్యోగాల్లో కొంత శాతం కోటా (రిజర్వేషన్) లభించే అవకాశం ఉంటుంది. ఇది రైల్వేలో శాశ్వత ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఒక బలమైన పునాదిగా మారుతుంది.
రైల్వేలో ఉద్యోగం సాధించాలనే పట్టుదల ఉన్నవారు ఈ సువర్ణావకాశాన్ని వదులుకోవద్దని విద్యా నిపుణులు చెబుతున్నారు. అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్లోని పూర్తి వివరాలను చదివి, తప్పులు లేకుండా దరఖాస్తు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. అప్లై చేసే సమయంలో విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం ఫోటోలను సిద్ధంగా ఉంచుకోవాలి. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, గడువు ముగియకముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.