Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ మూవీలో సల్మాన్ భాయ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న ఫొటో! కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2'లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఈ పవర్ ఫుల్ సీక్వెల్‌లో సల్మాన్ ఎంట్రీ నిజమేనా? వైరల్ అవుతున్న ఆ ఫొటో అసలు కథేంటో తెలుసుకోండి

Published : 2026-02-04 18:32:00

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ధురంధర్ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది. గతేడాది డిసెంబర్‌లో విడుదలై సుమారు రూ.1400 కోట్ల వసూళ్లతో భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో మెరవబోతున్నారా?

వైరల్ అవుతున్న ఫొటో.. సల్మాన్ ఎంట్రీ ఫిక్స్?గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్ షూటింగ్ సెట్‌లో ఉన్నట్లు ఒక ఫొటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.  వైట్ షర్ట్, బ్లాక్ కోట్ ధరించి గంభీరమైన లుక్‌లో ఉన్న సల్మాన్‌ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 'ధురంధర్' మొదటి భాగంలో సస్పెన్స్‌గా ఉంచిన 'బడే సాహబ్' పాత్రను సల్మాన్ ఖానే పోషిస్తున్నారని, క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ఎంట్రీ సినిమాకే హైలైట్ అవుతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి.

అయితే, ఈ వార్తలపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వైరల్ అవుతున్న ఆ ఫొటో నిజమైంది కాదు. ఎవరో కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి సల్మాన్ ఖాన్ లుక్‌ను సృష్టించారు. సదరు ఫొటో కింద ఉన్న డిస్క్లైమర్‌ను గమనిస్తే, ఇది కేవలం వినోదం కోసం సృష్టించిన ఫొటో అని, చిత్ర బృందానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'ధురంధర్' కేవలం హిందీలోనే విడుదలై సంచలనం సృష్టించింది. కానీ దీని సీక్వెల్ అయిన ధురంధర్: ది రివెంజ్' ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మంగళవారం విడుదలైన టీజర్‌లో రణ్‌వీర్ సింగ్ చెప్పిన ఇది కొత్త భారతం.. శత్రువుల ఇంటికి వెళ్లి మరీ కొడుతుంది అనే డైలాగ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అక్షయ్ ఖన్నా విలనీ, రణ్‌వీర్ స్పై లుక్స్ ఈ సీక్వెల్‌లో మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయి. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఉన్నారా లేదా అనే సస్పెన్స్ వీడాలంటే సినిమా విడుదల వరకు లేదా మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Spotlight

Read More →