నేషనల్ హైవేలపై కొత్త నిబంధనలు…
టోల్ ప్లాజాల వద్ద 'వే-ఇన్-మోషన్' యంత్రాలు…
ట్రాన్స్పోర్ట్ రంగంలో కీలక మార్పులు…
Road Safety: జాతీయ రహదారుల భద్రతను మెరుగుపరచడం మరియు రోడ్లు త్వరగా దెబ్బతినకుండా కాపాడటమే లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను ప్రకటించింది. 'జాతీయ రహదారుల రుసుము నాలుగో సవరణ నిబంధనలు-2026' పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు ఏప్రిల్ 15, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. పరిమితికి మించి బరువు మోసే వాహనాలపై ఉక్కుపాదం మోపుతూ, భారీ జరిమానాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త నిబంధనల ప్రకారం, వాహనాలకు కొంత మేరకు వెసులుబాటు కల్పించారు. నిర్దేశిత బరువు (Gross Vehicle Weight) కంటే 10 శాతం వరకు అదనపు బరువు ఉంటే ఎటువంటి జరిమానా విధించరు. అయితే, అదనపు బరువు 10 శాతం నుంచి 40 శాతం మధ్యలో ఉంటే, ఆ వాహనానికి టోల్ ప్లాజా వద్ద వసూలు చేసే సాధారణ రేటు కంటే రెండు రెట్లు (Double) జరిమానా విధిస్తారు. ఒకవేళ బరువు 40 శాతానికి మించి ఉంటే, ఏకంగా నాలుగు రెట్లు (4 Times) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా అమలు చేసేందుకు సాంకేతికతను వాడుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన 'వే-ఇన్-మోషన్' (WIM) యంత్రాల ద్వారా వాహనం కదులుతుండగానే బరువును లెక్కిస్తారు. ఈ జరిమానా మొత్తాన్ని కేవలం ఫాస్టాగ్ (FASTag) ద్వారా మాత్రమే వసూలు చేస్తారు. నగదు చెల్లింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. ఒకవేళ ఏ టోల్ ప్లాజా వద్దనైనా బరువు తూచే యంత్రం లేకపోతే, అక్కడ ఓవర్లోడ్ ఫీజు వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కేవలం జరిమానాతోనే సరిపెట్టకుండా, వాటి వివరాలను జాతీయ వాహన రిజిస్టర్ (వాహన్ పోర్టల్)లో నమోదు చేస్తారు. దీనివల్ల ఆ వాహనంపై ఒక శాశ్వత రికార్డు ఉంటుంది, ఇది భవిష్యత్తులో వాహన యజమానులకు ఇతర సేవలు పొందేటప్పుడు ఇబ్బందిగా మారవచ్చు. ఈ కఠిన నిబంధనల వల్ల వాహనదారులు పరిమితికి లోబడే సరుకు రవాణా చేస్తారని, తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.