Kollu Ravindra: జొన్నగిరి గోల్డ్ మైన్స్ పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర!

Kollu Ravindra: కర్నూలు జిల్లా జొన్నగిరిలోని గోల్డ్ మైన్స్ రాష్ట్రంలో ఖనిజ సంపద అభివృద్ధికి కొత్త అవకాశాలను తెరుస్తున్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Published : 2026-05-22 16:50:00

కర్నూలులో బంగారం తవ్వకాలతో రాష్ట్రానికి కొత్త ఆశలు..

ఆధునిక సాంకేతికతతో జొన్నగిరిలో బంగారం వెలికితీత..

కర్నూలు జిల్లా జొన్నగిరిలోని గోల్డ్ మైన్స్ రాష్ట్రంలో ఖనిజ సంపద అభివృద్ధికి కొత్త అవకాశాలను తెరుస్తున్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం జొన్నగిరిలో ఉన్న జియో మైసూర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన బంగారు గనులను ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మైనింగ్ ప్రాంతం, ప్రాసెసింగ్ యూనిట్లు, క్వారీ ప్రాంతాలను సందర్శించి అక్కడి కార్యకలాపాలపై అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

మైనింగ్ నిర్వహణలో ఉపయోగిస్తున్న ఆధునిక యంత్రాలు, భద్రతా ప్రమాణాలను పరిశీలించిన మంత్రి, దేశంలోని ఇతర గోల్డ్ మైన్స్‌తో పోలిస్తే జొన్నగిరిలో అత్యాధునిక సాంకేతికతతో తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్క టన్ను ఖనిజాన్ని ప్రాసెస్ చేస్తే సుమారు ఒక గ్రాము వరకు బంగారం లభిస్తోందని, నెలకు సుమారు మూడు కిలోల బంగారం వెలికితీస్తున్నారని అధికారులు వివరించారు. భవిష్యత్తులో ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ప్రైవేట్ రంగంలో గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు స్థానిక ప్రాంత అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు కూడా దోహదపడుతుందని మంత్రి చెప్పారు. అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో కూడా బంగారం నిల్వలు గుర్తించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అపారమైన భూగర్భ వనరులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం, దోపిడీ కారణంగా వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోయామని విమర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మినరల్స్‌కు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నామని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వ కాలంలో క్వార్ట్జ్ సహా రాష్ట్ర ఖనిజ వనరులను కొందరు దోచుకుని తమ జేబులు నింపుకున్నారని ఆరోపించిన మంత్రి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వనరులకు విలువ జోడించి రాష్ట్రానికి అధిక ఆదాయం, యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా పనిచేస్తోందన్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం 30 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Spotlight

Read More →