వాణిజ్య సిలిండర్ల కొరత.. మెట్రో నగరాల్లో మూతపడుతున్న రెస్టారెంట్లు.
హోటల్ ఇండస్ట్రీకి ఎల్పీజీ షాక్.. ముంబయిలో సగం హోటళ్లు మూసివేసే ప్రమాదం?
గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా.. నిఘా పెంచిన కేంద్ర ప్రభుత్వం…
LPG Shortage In Mumbai: దేశంలో వంట గ్యాస్ కొరత (LPG Shortage) ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్ల సరఫరాలో అంతరాయం కలగడం వల్ల దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దాదాపు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబయి హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూసివేయక తప్పదని అసోసియేషన్ హెచ్చరించింది.
కేవలం ముంబయిలోనే కాకుండా ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాల్లో కూడా వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల హోటల్ యజమానులు తమ వ్యాపారాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఎల్పీజీ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచడమే కాకుండా, సరఫరాను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
భారతదేశం తన వార్షిక వంట గ్యాస్ అవసరాల్లో (సుమారు 31.3 మిలియన్ టన్నులు) 62 శాతాన్ని విదేశాల నుండే దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో చోటుచేసుకున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేయడం ఈ దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే, మన దేశంలో ప్రస్తుతానికి సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ప్రస్తుతానికి పెంచబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది.