హైదరాబాద్లో ట్రాఫిక్కు అడ్డుగా ఉన్న అక్రమ కట్టడాల తొలగింపులో హైదరాబాదు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హైడ్రా) కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ హైకోర్టు ప్రశంసించింది. నగరాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా చేస్తున్న కృషి ప్రశంసనీయమని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో హైడ్రా సేవలు అత్యవసరమని జస్టిస్ బి. విజయ్సేన్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
రాంనగర్ మణెమ్మ వీధిలో రోడ్డును ఆక్రమించి వాణిజ్య సముదాయాన్ని కట్టారని స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసింది. దానికి స్పందించిన జీహెచ్ఎంసీ, హైడ్రా సహకారంతో జమిస్తాన్పూర్ రాంనగర్ క్రాస్రోడ్స్ వద్ద రోడ్డుపై కట్టిన అక్రమ వాణిజ్య భవనాన్ని కూల్చివేసింది. దీంతో రాంనగర్ ప్రధాన రహదారికి అడ్డంకులు తొలగిపోయాయి.
అయితే, తన భవనాన్ని కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఆ వాణిజ్య సముదాయ యజమాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు చేస్తూ, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ వాయిదా వేసింది.