తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక సూచన చేశారు. వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలని సూచించారు.. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు ఈ నిబంధన పాటిస్తే బావుంటుందన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ సూచన చేశారు. టీటీడీ నిధుల్ని శ్రీవారి భక్తుల కోసం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని.. ఈ నిధుల విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. ఊరికో గుడి, బడి ఉండాలని.. బడి బాధ్యత ప్రభుత్వానికి ఉంటే.. గుడి బాధ్యత టీటీడీ తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అంతకముందు వెంకయ్యనాయుడు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారిని కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్లు వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆగస్టు నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు 'తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నవంబరులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చిపై ఊరేగిస్తారు. ఆగస్టు 9వ తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లకు అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.
సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు. ఆగస్టు 16న శ్రీకృష్ణాష్టమి ఆస్థానం. ఆగస్టు 18న ఉట్లోత్సవం. ఆగస్టు 20న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్సేవ నిర్వహిస్తారు. ఆగస్టు 23న అమావాస్య సందర్భంగా ఉదయం 9 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది' అని టీటీడీ విశేష ఉత్సవాలపై ఒక ప్రకటనలో తెలిపింది.