AP Electricity Department: ఏపీలో రూ. 6 వేల కోట్లతో 200 కొత్త సబ్ స్టేషన్లు: అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన...

AP Assembly Sessions: విజయనగరం వేణుగోపాలపురం 220/132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 6 వేల కోట్లతో 200 కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటు విద్యుత్ డిమాండ్ పై అసెంబ్లీలో వెల్లడించిన పూర్తి వివరాలు...

Published : 2026-03-05 10:28:00

విజయనగరం నగర పరిధిలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. శాసనసభ గడువులో భాగంగా, విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మీ గజపతిరాజు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి  సమాధానమిచ్చారు. ముఖ్యంగా వేణుగోపాలపురం వద్ద నిర్మించ తలపెట్టిన 220/132 కేవీ సబ్ స్టేషన్ పనుల పురోగతిని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం రీ-టెండరింగ్ దశలో ఉందని, అన్ని ప్రక్రియలను వేగవంతం చేసి మార్చి 2027 నాటికి ఈ భారీ సబ్ స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సబ్ స్టేషన్ నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు సంబంధిత విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. గడిచిన కాలంలో నిలిచిపోయిన పనులను తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు సుమారు 46 కోట్ల రూపాయల వ్యయంతో రెండు భారీ 220 కేవీ ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

విజయనగరంలో అండర్ గ్రౌండ్  కేబులింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై మంత్రి స్పందిస్తూ, ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని వివరించారు. అయితే, నగరంలోని రద్దీ ప్రాంతాలు  అత్యవసర ఆవశ్యకతను బట్టి, నిధుల లభ్యతను పరిగణనలోకి తీసుకుని దీనిపై భవిష్యత్తులో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వర్షాకాలంలో తలెత్తే విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు  తెలిపారు.

రాష్ట్రవ్యాప్త విద్యుత్ పరిస్థితిపై మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఏటా పారిశ్రామిక, వాణిజ్య,  వ్యవసాయ రంగాల్లో వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని  భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా 200 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ  విస్తరణ కోసం ప్రభుత్వం సుమారు 6 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని, లోడ్ ఎక్కువగా ఉన్న ప్రతి ప్రాంతంలోనూ కొత్త సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు రవికుమార్ ప్రకటించారు.

వ్యవసాయ దారులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు, గృహ వినియోగదారులకు ఎటువంటి కోతలు లేని సరఫరాను అందించడమే తమ ప్రాధాన్యత అని మంత్రి పునరుద్ఘాటించారు. పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేలా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, విద్యుత్ శాఖలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన సభకు వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో విజయనగరం సహా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని  మంత్రి గొట్టిపాటి ధీమా వ్యక్తం చేశారు.

Spotlight

Read More →