అమరావతి రాజధానిలో మరో కీలక అభివృద్ధి చోటుచేసుకుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తమ ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి తుది ఒప్పందాన్ని పూర్తి చేసింది. ఇందుకోసం గుంటూరు జిల్లా నేలపాడు గ్రామంలో మూడు ఎకరాల భూమి ను రాష్ట్రము నుండి కొనుగోలు చేసింది. ఈ భూమికి ఆర్బీఐ రూ. 12 కోట్లు చెల్లించింది.
శుక్రవారం ఈ భూమి కొనుగోలు ఒప్పందం అధికారికంగా కుదిరింది. ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వి.సి. రూప్, రాష్ట్ర ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్ వి. డేవిడ్ రాజు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది.
ఆర్బీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొత్త కార్యాలయం సుమారు 1.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోషనిర్మించబడనుంది. ఈ ప్రాజెక్టు కోసం బ్యాంక్ దాదాపు రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. కార్యాలయంలో ప్రధాన భవనం, సమావేశ హాళ్లు, డేటా సెంటర్, ఉద్యోగుల విభాగాలు, రికార్డు రూములు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
రాజధాని నగరంలో రిజర్వ్ బ్యాంక్ వంటి జాతీయ స్థాయి సంస్థలు తమ స్థావరాన్ని ఏర్పరచుకోవడం, అమరావతి ఆర్థిక పరంగా ఎదుగుతున్నదానికి సూచికగా భావించవచ్చు. భవిష్యత్తులో ఇది దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన ఫైనాన్షియల్ హబ్గా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం భూమి రిజిస్ట్రేషన్ పూర్తయింది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అధికారులు అంచనా ప్రకారం, ఈ కార్యాలయ భవనం రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తవుతుందని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతి నగరానికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించనుంది. రిజర్వ్ బ్యాంక్ అడుగుతో రాజధానిలో ఆర్థిక రంగం మరింత చురుకుదనాన్ని సంతరించుకోనుంది.