Trisha Instagram Post: నటుడు, దర్శకుడు ఆర్. పార్తిబన్ ఇటీవల నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో త్రిష వ్యక్తిగత విషయాలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్తిబన్ ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేస్తూ, తన మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకుంటూనే, ఆ సమయంలో జరిగిన అసలు విషయాన్ని బయటపెట్టారు.
ఆ కార్యక్రమంలో ఏం జరిగిందనేది వివరిస్తూ.. "అక్కడ వరుసగా 20 ప్రశ్నలు అడిగే రాపిడ్ ఫైర్ రౌండ్ జరుగుతోంది. స్క్రీన్పై త్రిష ఫోటో రాగానే, ప్రేక్షకులంతా 'కుందవై.. కుందవై' అంటూ పెద్దగా నినాదాలు చేశారు. ఆ హడావిడిలో సరదాగా ఉంటుందని 'కుందవైని ఇంట్లోనే ఉంచితే మంచిది, అప్పుడు సమస్యలు ఉండవు' అని అన్నాను. అయితే నా మాటల తర్వాత అక్కడ ఉన్న వాళ్లంతా గట్టిగా చప్పట్లు కొట్టారు. అలా చప్పట్లు కొట్టిన వారిలో ఎక్కువ మంది హీరో విజయ్ అభిమానులే ఉన్నారు" అని పార్తిబన్ పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై త్రిష సోషల్ మీడియా వేదికగా ఘాటుగానే స్పందించారు. మైక్రోఫోన్ చేతిలో ఉన్నంత మాత్రాన ఎవరూ తెలివైన వారు అయిపోరని, అగౌరవంగా మాట్లాడటం ఆ వ్యక్తి యొక్క అజ్ఞానాన్ని, స్వభావాన్ని చూపిస్తుందని ఆమె పరోక్షంగా చురకలు అంటించారు. తన పేరును, ఫోటోను అనుమతి లేకుండా వాడుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. త్రిష చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో పార్తిబన్ పై ఒత్తిడి పెరిగింది.
ఈ వివాదం ముదురుతుండటంతో పార్తిబన్ వెనక్కి తగ్గారు. "జరిగిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం తప్ప నాకు మరో మార్గం లేదు. ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా నేను అలా మాట్లాడి ఉండకూడదని సూచించారు. వెంటనే నేను నిర్వాహకులను కలిసి ఆ వీడియోను టెలికాస్ట్ చేయవద్దని కోరాను. కానీ ఎవరో మొబైల్ లో తీసిన క్లిప్ బయటకు వచ్చి ఇంత రచ్చ అయింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను మహిళల స్వేచ్ఛను గౌరవించే వ్యక్తినని, ఎవరినీ కావాలని నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం విజయ్, త్రిషల గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్న తరుణంలో పార్తిబన్ చేసిన ఈ కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న వేళ, ఆయన ఫ్యాన్స్ పేరును ఈ వివాదంలోకి లాగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి పార్తిబన్ క్షమాపణలు కోరడంతో ఈ వివాదం ఇక్కడితో సర్దుమణిగే అవకాశం కనిపిస్తోంది.