PMVBRJY Scheme Details: ప్రస్తుత రోజుల్లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో ఉన్న యువతకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. నిరుద్యోగితను తగ్గించి, కొత్తగా కెరీర్ ప్రారంభించే వారిని ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన' (PMVBRJY) అనే అద్భుతమైన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఏకంగా 15 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది.
రెండు విడతల్లో నగదు జమ
ఈ పథకం కింద లబ్ధిదారులకు అందే రూ. 15,000 మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి కాకుండా రెండు విడతల్లో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తుంది. ఉద్యోగంలో చేరిన మొదటి ఆరు నెలల కాలం పూర్తి కాగానే తొలి విడతగా 7,500 రూపాయలు, ఆ తర్వాత ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రెండో విడతగా మరో 7,500 రూపాయలు అందుతాయి. దీనివల్ల కొత్తగా బాధ్యతలు చేపట్టిన యువతకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఎవరెవరు అర్హులు
ఈ నగదు సాయం పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం:
జీతం పరిమితి: నెలకు ఒక లక్ష రూపాయల కంటే తక్కువ జీతం తీసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులే.
తొలి ఉద్యోగం: ఇది కేవలం మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడూ పీఎఫ్ ఖాతా లేని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
పీఎఫ్ ఖాతా తప్పనిసరి: ఉద్యోగి కచ్చితంగా ఈపీఎఫ్ఓ (EPFO)లో నమోదై ఉండాలి.
ఆధార్ లింక్: అభ్యర్థి ఆధార్ కార్డు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి.
అప్లై చేసుకోవడం ఎలా?
చాలామందికి ఈ పథకం కోసం ఎక్కడ తిరగాలి, ఏ ఆఫీసులకు వెళ్లాలి అనే సందేహం ఉంటుంది. అయితే, ఈ స్కీమ్ బ్యూటీ ఏంటంటే.. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఎక్కడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక కంపెనీలో చేరినప్పుడు వారు మీ పేరు మీద పీఎఫ్ ఖాతా తెరిస్తే చాలు, ప్రభుత్వం ఆటోమేటిక్గా మీ వివరాలను సేకరించి అర్హుల జాబితాలో చేరుస్తుంది. మీ పీఎఫ్ ఖాతా ఆధారంగానే ప్రభుత్వం నేరుగా నగదును బదిలీ చేస్తుంది.
కంపెనీలకు కూడా లాభమే
కేవలం ఉద్యోగులకే కాకుండా, ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది. కొత్తగా ఒక ఉద్యోగిని చేర్చుకున్నందుకు గానూ సదరు కంపెనీకి నెలకు గరిష్టంగా 3,000 రూపాయల వరకు రెండేళ్ల పాటు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉద్యోగి జీతాన్ని బట్టి ఈ ఇన్సెంటివ్ మారుతూ ఉంటుంది. చిన్న మొత్తంలో జీతం ఇచ్చే కంపెనీలకు కూడా ఈ పథకం ద్వారా ఊతం లభిస్తోంది. 2025-26 బడ్జెట్లో ప్రకటించిన ఈ వినూత్న పథకం ఇప్పటికే క్షేత్రస్థాయిలో అమలవుతోంది. మీరు కూడా కొత్తగా ఉద్యోగంలో చేరి ఉంటే, మీ కంపెనీ హెచ్ఆర్ విభాగంలో మీ పీఎఫ్ నమోదు గురించి అడిగి తెలుసుకోండి. ఈ అవకాశం అస్సలు వదులుకోకండి