గంటల్లో ఫైళ్ల పరిష్కారం.. మంత్రి అచ్చెన్న పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు..
పారదర్శకత, వేగం, సమర్థత.. మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకత..
అమరావతి: రాష్ట్ర పరిపాలనలో వేగం, పారదర్శకతకు కొత్త ప్రమాణాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ-ఫైళ్ల క్లియరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసాధారణ పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ యంత్రాంగంలో చురుకుదనాన్ని పెంచుతున్నాయి. గతంలో ఒక ఈ-ఫైల్ క్లియర్ చేయడానికి సుమారు 5 గంటల సమయం పట్టేది. అయితే ఇప్పుడు భారీ స్థాయిలో ఫైళ్లు వచ్చినప్పటికీ, సరాసరి కేవలం 2 గంటల 49 నిమిషాల్లోనే ఫైళ్లను పరిష్కరిస్తున్నారు. ఇది పరిపాలనా సామర్థ్యానికి స్పష్టమైన నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.
ఈ మార్పుతో ఈ-ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ రోజులు పట్టే స్థితి నుంచి గంటల వ్యవధిలో పూర్తయ్యే స్థాయికి చేరింది. దీని వల్ల ప్రజలకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి అవుతూ, ప్రభుత్వ సేవలపై విశ్వాసం మరింత పెరుగుతోంది.
మంత్రి అచ్చెన్నాయుడు పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. పరిపాలనలో వేగం, పారదర్శకత, ప్రజా ప్రయోజనాల పట్ల కట్టుబాటు చూపుతున్నందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
మంత్రి అచ్చెన్నాయుడు నాయకత్వంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన చర్యలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు.