ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకున్న ఖతార్లో తెలుగు ప్రజలు..
ఎంతో ఘనంగా మహా రక్తదాన శిబిరం ఏర్పాటు..
ఖతార్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఖతార్లో తెలుగు ప్రవాసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి మహా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా “ఒక్క రక్త బిందువు – ఎన్నో ప్రాణాలకు జీవం” అనే మహత్తర సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
ఎన్నారై టీడీపీ ఖతార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో కులం, మతం, దేశం, ధనిక–పేద అనే భేదాలకు అతీతంగా మానవత్వమే ముఖ్యమని నిరూపించారు. ఒక మనిషి మరో మనిషికి ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమానం రక్తదానం అనే భావనను ప్రతి ఒక్కరిలో నింపేలా కార్యక్రమం సాగింది.
ఈ సందర్భంగా ఎన్.ఆర్.ఐ టీడీపీ ఖతార్ అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ… నాయకుడి జన్మదినాన్ని వేడుకగా కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా నిర్వహించడం నిజమైన గౌరవమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజాసేవ కోసం అని, సేవ చేయడానికి దేశాల మధ్య ఎలాంటి భేదం ఉండదని, ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలకు అండగా నిలబడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
శనివారం వర్కింగ్ డే అయినప్పటికీ ఖతార్లోని తెలుగు కుటుంబాల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 65 మంది సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా టీడీపీ ఖతార్ మహిళలు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి సేవా భావం సమాజానికి స్ఫూర్తినిచ్చే ఉదాహరణగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు రవి వేమూరి, గల్ఫ్ విభాగం అధ్యక్షులు రావి రాధాకృష్ణ, ఏపీ ఎన్నార్టీ సర్వీసెస్ డైరెక్టర్ అక్కిలి నాగేంద్రబాబు, ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ తదితరులు తమ సహకారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా తెలుగు డయాస్పోరా సభ్యులు మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సేవా భావం, సమాజం పట్ల బాధ్యతను నిలబెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.