సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఆగ్రహం…
మరో 10% గ్లోబల్ టారిఫ్ ప్రకటన!!
డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్లపై ఇచ్చిన తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 20న ఇచ్చిన కీలక తీర్పులో అధ్యక్షుడికి ఏకపక్షంగా గ్లోబల్ టారిఫ్లు విధించే అధికారం లేదని ఆ హక్కు కేవలం కాంగ్రెస్కే ఉందని అమెరికా సుప్రీంకోర్టు (Supreme Court of the United States) స్పష్టం చేసింది. 6 మంది న్యాయమూర్తులు టారిఫ్లను కొట్టివేయగా ముగ్గురు సమర్థించారు. దీంతో IEEPA కింద ప్రకటించిన ‘లిబరేషన్ డే’ టారిఫ్లు, కెనడా-మెక్సికో-చైనా సంబంధిత సుంకాలు సహా పలు దేశాలపై విధించిన రుసుములు రద్దయ్యాయి.
ఈ తీర్పును “దేశానికి అవమానకరం”గా అభివర్ణించిన ట్రంప్, వైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ జడ్జిలపై తీవ్ర విమర్శలు చేశారు. అయినప్పటికీ, టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గబోనని ప్రకటిస్తూ ట్రేడ్ ఆక్ట్ సెక్షన్ 122 కింద అన్ని దేశాలపై అదనంగా 10 శాతం గ్లోబల్ టారిఫ్లు విధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త సుంకాలు 150 రోజులు అమల్లో ఉండొచ్చని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవి అమలవుతాయా లేదా అన్నది అనుమానాస్పదంగా మారింది. భారత్తో ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ “ఏమి మారలేదు” అని స్పష్టం చేశారు.
భారత్పై ఇప్పటికే అమలులో ఉన్న సుమారు 18 శాతం టారిఫ్లు కొనసాగుతాయని, కొత్తగా ప్రకటించిన 10 శాతం అదనపు సుంకం కూడా వర్తిస్తుందని సంకేతాలిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించినప్పటికీ, ఈ నిర్ణయం భారత్ సహా పలు దేశాల్లో ఆందోళనకు దారితీసింది. ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో మరింత అనిశ్చితి నెలకొనే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.