ప్రతీ జిల్లాలోనూ ఆర్టీఐహెచ్ స్పోక్ మోడళ్లను అభివృద్ధి చేయాలి..
8,9,10 తరగతుల విద్యార్ధులకు స్టూడెంట్ ఇన్నోవేషన్ కాంక్లేవ్..
అమరావతి: రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వివిధ శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, జిల్లాల అభివృద్ధికి స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చారు.
సమావేశంలో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఆర్టీఐహెచ్ స్పోక్ మోడళ్లను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ అవసరాలకు తగిన ఏఐ పరిష్కారాలను ఆర్టీఐహెచ్ ద్వారా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం త్వరలో స్టూడెంట్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ నిర్వహించాలని ప్రతిపాదించారు.
జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా డీపీఐసీ సమావేశాలు నిర్వహించాలని, “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” కార్యక్రమాన్ని బలోపేతం చేసేలా పరిశ్రమలను ఆకర్షించాలని సూచించారు. రాష్ట్రంలో భూసేకరణ ఎలాంటి వివాదాలు లేకుండా జరుగుతోందని, భూయజమానులను అభివృద్ధిలో భాగస్వాములుగా మారుస్తున్నామని చెప్పారు. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూ సమీకరణ ఒక వినూత్న ప్రక్రియగా నిలిచిందని పేర్కొన్నారు.
పారిశ్రామిక రంగంపై దృష్టి సారిస్తూ అనంతపురంలో సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డిఫెన్స్ పరిశ్రమ రానుందని తెలిపారు. అలాగే ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమ 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించనుందని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని సోలార్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ, ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని, చిత్తూరు జిల్లా కోసల నగరం ప్రాంతాన్ని మరో శ్రీసిటీలా అభివృద్ధి చేయాలని సూచించారు. చెన్నై నుంచి పరిశ్రమలు అక్కడికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో 50 వేల హోటల్ గదుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. వ్యవసాయ రంగం ప్రస్తుతం రాష్ట్ర జీడీపీలో 10 శాతం వాటా కలిగి ఉందని, త్వరలో అది 15 శాతానికి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్వా, హార్టీకల్చర్ రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, అరకు కాఫీ వంటి ఉత్పత్తులు జిల్లాల ఆర్థిక వ్యవస్థను మార్చగలవని అన్నారు.
అంతేకాకుండా “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” కేవలం పేపర్ మీద కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించాలన్నారు. జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్లుగా ఉన్న మంత్రులతో కలెక్టర్లు సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమని సీఎం స్పష్టం చేశారు.