SATS Saudi Arabia: బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లిన ఒక సామాన్యుడికి ఆపద వస్తే, తోటి తెలుగువారు అండగా నిలబడితే ఎలా ఉంటుందో సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య (SATS) మరోసారి నిరూపించింది. యజమాని వేధింపులు, అనారోగ్యం, ఆకలితో అల్లాడిపోతున్న మెహబూబ్ పీర్ షేక్ అనే వ్యక్తిని అక్కున చేర్చుకుని, సురక్షితంగా ఇంటికి పంపించి తమ ఉదారతను చాటుకున్నారు.
విమానాశ్రయంలో దిక్కుతోచని స్థితిలో..
మార్చి 17వ తేదీ ఉదయం దమ్మమ్ విమానాశ్రయంలో ఒక వ్యక్తి కన్నీళ్లతో, తీవ్రమైన భయాందోళనల మధ్య ఉన్నాడనే సమాచారం SATS కార్యవర్గ సభ్యుడు ప్రవీణ్ కోలేటికి అందింది. కడప జిల్లాకు చెందిన మెహబూబ్ అనే ఆ వ్యక్తి, మాట్లాడలేని స్థితిలో ఆకలితో అలమటిస్తూ అక్కడ నిలబడి ఉన్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రవీణ్ కోలేటి, కిషోర్ గారు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నారు. మొదట వారిని చూసి భయపడిన మెహబూబ్కు ధైర్యం చెప్పి, మూడు గంటల పాటు ఓపికగా మాట్లాడి జుబైల్లోని తమ క్యాంప్కు తీసుకువచ్చారు.
ఎడారిలో ఎదురైన నరకం
మెహబూబ్ కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు… తొమ్మిది నెలల క్రితం డ్రైవర్ పని కోసం కువైట్ వీసాతో వచ్చిన అతడిని, యజమాని మోసగించి సౌదీ సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెలు కాయడానికి పంపాడు. ఆ పని చేయలేనన్నందుకు చిత్రహింసలకు గురిచేశాడు. తిండి లేక, ఎండకు మాడిపోతూ మెహబూబ్ తీవ్రమైన అనారోగ్యం (పైల్స్, చర్మ వ్యాధులు) బారిన పడ్డారు. చివరికి తన వద్ద ఉన్న డబ్బులు కట్టి, విముక్తి పొంది విమానాశ్రయానికి చేరుకున్నా, యుద్ధ వాతావరణం వల్ల విమానం రద్దయి అక్కడ ఒంటరివాడైపోయారు.
అండగా నిలిచిన సేవా తత్పరత
జుబైల్ చేరుకున్నాక మెహబూబ్కు కిషోర్ గారు ఆశ్రయం కల్పించారు. సుమారు 25 రోజుల పాటు తన సొంత ఖర్చులతో భోజనం, వైద్యం అందించి సొంత తమ్ముడిలా చూసుకున్నారు. మరోవైపు మనోహర్ ప్రసాద్ గారు రంగంలోకి దిగి మెహబూబ్ పాస్పోర్ట్, వీసా వివరాలను పరిశీలించారు. అదృష్టవశాత్తూ అతడి డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగానే ఉన్నాయని, ఇండియా వెళ్లడానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఐక్యతతో సాధ్యమైన ప్రయాణం
అయితే ఇండియా వెళ్లడానికి టికెట్ ఖర్చు ఒక సమస్యగా మారింది. ఈ విషయాన్ని SATS సభ్యుల దృష్టికి తీసుకెళ్లగానే, తెలుగు వారందరూ స్పందించారు. శివరామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి, వెంకట కృష్ణస్వామి, సోహేబ్ వంటి వారు తక్షణమే ఆర్థిక సాయం అందించారు. అలాగే సురేష్ రెడ్డి నల్లారి, అనిల్ కుమార్ రెడ్డి కూడా తమ వంతు సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. కింగ్డమ్ ట్రావెల్స్ వారు కూడా టికెట్ ధర తగ్గించి తమ వంతు సాయం చేశారు.
గమ్యం చేరిన ప్రాణం
ఈ మొత్తం వ్యవహారంలో పాపారావు గారు, శ్రీనివాస్ గుబ్బాల గారు వెనకుండి మార్గదర్శకత్వం వహించారు. SATS సభ్యులందరి సమిష్టి కృషితో ఏప్రిల్ 10న మెహబూబ్ సురక్షితంగా తన స్వగ్రామానికి చేరుకున్నారు. పరాయి దేశంలో చావుకు దగ్గరైన ఒక వ్యక్తిని కాపాడి, తన కుటుంబం వద్దకు చేర్చడం ద్వారా మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ సంఘటన నిరూపించింది.
సేవయే పరమావధి
మేము కలిసుంటే ఏదైనా సాధించగలం అనే నినాదంతో పనిచేస్తున్నామని SATS ప్రెసిడెంట్ కొనేరు ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఒక సామాన్య కార్మికుడి కన్నీళ్లు తుడిచిన ఈ గాథ, విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది.