ఆర్థిక ఆంక్షలకు ప్రతిగా కొత్త వ్యూహం
భద్రత పర్యావరణ సాకుతో
అమెరికా మిత్రదేశాల అభ్యంతరం
Iran Hormuz Strait: పశ్చిమాసియా సెగలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని తాకనున్నాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి 'టోల్' వసూలు చేయాలని ఇరాన్ పార్లమెంట్ నిర్ణయించింది. కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా, వ్యూహాత్మక ప్రతీకార చర్యగా ఇరాన్ వేసిన ఈ అడుగు ఇప్పుడు గల్ఫ్ రీజియన్లో పెను సంచలనంగా మారింది.
ఇరాన్పై అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలకు చెక్ పెట్టేలా టెహ్రాన్ ఈ సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది. హార్ముజ్ జలసంధి మార్గంలో వెళ్లే ప్రతి నౌక ఇకపై ఇరాన్ అధికారిక కరెన్సీ అయిన 'రియాల్' రూపంలోనే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇరాన్ కరెన్సీకి అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడమే కాకుండా, యుద్ధం వల్ల దెబ్బతిన్న తమ ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయం వస్తుందని ఇరాన్ పార్లమెంటరీ భద్రతా కమిటీ భావిస్తోంది.
ఈ కొత్త చట్టం ప్రకారం.. కేవలం డబ్బు వసూలు చేయడమే కాకుండా, ఆ సముద్ర మార్గంలో నౌకల భద్రత, సముద్ర కాలుష్యాన్ని నివారించడం వంటి బాధ్యతలను కూడా ఇరాన్ తన చేతుల్లోకి తీసుకోనుంది. అంటే ఆ మార్గంలో ఏ నౌక వెళ్లాలన్నా ఇరాన్ నిబంధనలకు లోబడి ఉండాల్సిందే. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రు దేశాల నౌకలను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇది మున్ముందు సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడిచమురులో దాదాపు 20 శాతం ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఇప్పుడు ఇరాన్ టోల్ వసూలు చేయడం మొదలుపెడితే, చమురు కంపెనీలపై అదనపు భారం పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణం కావచ్చు. ఇప్పటికే యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిన్న వేళ, ఈ కొత్త 'టోల్' భారం సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తోంది.
ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హార్ముజ్ జలసంధి అనేది అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని, అక్కడ టోల్ వసూలు చేసే హక్కు ఏ ఒక్క దేశానికి లేదని వాషింగ్టన్ వాదిస్తోంది. ఈ విషయంలో ఇరాన్ను అడ్డుకునేందుకు అమెరికా తన నావికా దళాలను రంగంలోకి దింపే అవకాశం ఉంది. ఫలితంగా గల్ఫ్ సముద్రం మరో యుద్ధ క్షేత్రంగా మారే ప్రమాదం పొంచి ఉండనుంది.
ఇరాన్ పార్లమెంట్ ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో, అమలు ప్రక్రియ వేగవంతం కానుంది. ఒకవేళ నౌకలు టోల్ కట్టడానికి నిరాకరిస్తే, వాటిని ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇది గల్ఫ్ దేశాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా, ఐక్యరాజ్యసమితిలో పెద్ద చర్చకు దారితీసేలా ఉంది. మ ఇరాన్ వేసిన ఈ ఎత్తుగడ పశ్చిమాసియా రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పనుంది.