అంతర్జాతీయ వేదికపై ఆంధ్ర వనిత గళం…
సౌదీ సదస్సులో చేతన జగదీశ్వరి ప్రసంగం…
ప్రపంచ కార్మిక సదస్సులో హిందూపూర్ మహిళ సత్తా…
సౌదీ అరేబియాలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో ఆంధ్ర వనిత చేతనకు తన అభిప్రాయాలను పంచుకునే అరుదైన అవకాశం దక్కింది. విదేశాల్లో పనిచేసే భారతీయ కార్మికుల ఆరోగ్య భద్రతపై ఆమె ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పుల గురించి చర్చించడానికి తాజాగా ప్రపంచ కార్మిక మార్కెట్ సదస్సు (జీఎల్ఎంసీ) జరిగింది. ఇందులో వందకు పైగా దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థలు, సౌదీ అరేబియా: మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా హిందూపూర్కు చెందిన చేతన జగదీశ్వరికి కూడా ఈ సదస్సులో ఓ ముఖ్య అంశంపై మాట్లాడే అవకాశం దక్కింది. సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ కార్మిక సంస్థ, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ఐరోపా యూనియన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 'అధిక ఉష్ణోగ్రతల్లో, సరైన వసతులు, వెలుతురు, గాలి లేకుండా నివసించే కార్మికుల పరిరక్షణలో సామాజిక బాధ్యత' అంశంపై జరిగిన సదస్సులో తాను పాల్గొని ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో మాట్లాడానని చేతన చెప్పారు.
కార్మికులు తమ ఉపాధి దేశం నుంచి మాతృదేశాలకు తిరిగి వెళ్ళిన తర్వాత సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టే దిశగా సరిహద్దులకు అతీతంగా కృషి జరగాలని చేతన సూచించారు. అధిక ఉష్ణోగ్రత నుంచి కార్మికులను కాపాడే దిశగా ఇప్పటికే సౌదీ అరేబియా ప్రభుత్వం వేసవి కాలంలో బయట ఎండలో పని చేయడాన్ని నిషేధించిందన్నారు. తద్వారా ఈ దిశగా పురోగతి సాధిస్తున్నందుకు సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు తెలిపారు.
సౌదీ అరేబియాలో క్రియాశీలక తెలుగు మహిళలలో ఒకరైన చేతన చాలా కాలంగా కుటుంబ సమేతంగా అక్కడే నివసిస్తున్నారు. వివిధ సమస్యలపై స్పందించే ఆమె సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల సంస్థ సాటా సెంట్రల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చేతన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నందుకు సాటా సెంట్రల్ ఆమెను అభినందించింది.