ఎండాకాలంలో కూడా ఇల్లు కూల్ కూల్..
పురాతన పద్ధతి మళ్ళీ అమలులోకి..
ఎండాకాలం ముదురుతున్న కొద్దీ మధ్యాహ్నానికి ఇళ్లలో ఉండటం చాలా కష్టంగా మారుతోంది. ఇంటి పైకప్పు వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది, ఫ్యాన్లు ఫుల్ స్పీడ్లో తిరిగినా గాలి గట్టిగా, భారంగా అనిపిస్తోంది. ఇది కేవలం మనకు అనిపించేది మాత్రమే కాదు… రోజంతా సూర్యకిరణాలను పీల్చుకున్న పైకప్పు ఆ వేడిని నెమ్మదిగా ఇళ్లలోకి విడుదల చేస్తోంది.
ఈ పరిస్థితిలో చాలా మంది ఎయిర్ కండిషనర్లపై ఆధారపడుతున్నారు. కానీ అవి ఖర్చుతో పాటు పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం లేకుండా ఇళ్లు చల్లగా ఉంచే మార్గాలపై మళ్లీ చర్చ మొదలైంది.
పాత పద్ధతిలో కొత్త పరిష్కారం
ఈ సమస్యకు సమాధానం మన ఇళ్ల పైకప్పులలోనే దాగి ఉంది. మట్టి కుండల వినియోగంతో రూపొందించే “ఫిల్లర్ స్లాబ్” అనే పద్ధతి ఇప్పుడు మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తోంది.
ఈ విధానంలో పైకప్పు నిర్మాణ సమయంలో మట్టి కుండలను తలకిందులుగా అమర్చి, వాటి చుట్టూ కాంక్రీట్ పోస్తారు. కాంక్రీట్ గట్టిపడిన తర్వాత ఆ కుండలు చిన్న చిన్న ఎయిర్ గ్యాప్స్ (ఎయిర్ పాకెట్స్) సృష్టిస్తాయి.
ఈ ఎయిర్ గ్యాప్స్ ఖాళీలు సహజ ఇన్సులేషన్లా పనిచేసి, పైకప్పు నుంచి వచ్చే వేడి ఇళ్లలోకి చేరడాన్ని తగ్గిస్తాయి. మట్టి సహజంగా వేడి ప్రవేశాన్ని నిరోధించే గుణం కలిగి ఉండటం మరో ప్రయోజనం.
ఈ పద్ధతి ద్వారా ఇళ్లలో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. కొన్నిసార్లు 50 శాతం వరకు చల్లదనం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మట్టి కుండలు తక్కువ ఖర్చుతో సులభంగా లభిస్తాయి. సాంకేతికత కూడా క్లిష్టం కాదు. సంప్రదాయ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ పద్ధతి పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.
ఇంటి లోపల వేడి తగ్గడంతో ఎయిర్ కండిషనర్ల అవసరం తగ్గుతుంది. దీంతో విద్యుత్ బిల్లులు కూడా తగ్గి, పర్యావరణం లో కార్బన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ ఎయిర్ గ్యాప్స్ వేసవిలో ఇల్లు చల్లగా ఉంచడమే కాకుండా, చలికాలంలో వేడిని నిలుపుకోవడంలో కూడా సహాయపడతాయి. దీంతో సంవత్సరమంతా ఇల్లు సౌకర్యంగా ఉంటుంది.
ఇప్పటి ఆధునిక నిర్మాణాల్లో వేగం, ఒకే రకం డిజైన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ పాత కాలంలో భారతీయ నిర్మాణ శైలులు వాతావరణానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి.
పట్టణాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ఈ కాలంలో, చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. సాధారణ మట్టి కుండల్లోనే చల్లని, సుస్థిర జీవనానికి మార్గం దాగి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.