కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాత్మక పోరాటానికి సిద్ధమైంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారం కేవలం ఒక అవినీతి కుంభకోణం మాత్రమే కాదని, అది హైందవ ధర్మంపై జరిగిన దాడి అని భావిస్తున్న కూటమి ప్రభుత్వం, ఈ పాపానికి ఒడిగట్టిన అసలైన 'సూత్రధారులను' బయటకు లాగేందుకు న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నెయ్యి కల్తీ అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక విచారణ బృందం (SIT) సమర్పించిన నివేదికను మంత్రులు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, సిట్ సేకరించిన ప్రాథమిక ఆధారాలకు మరియు కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలోని అంశాలకు మధ్య పొంతన లేకపోవడాన్ని కేబినెట్ తీవ్రంగా పరిగణించింది.
దర్యాప్తులో వెలుగుచూసిన కీలకమైన వాస్తవాలు ఛార్జ్ షీట్లలో ఎందుకు మిస్ అయ్యాయి? ఎవరిని కాపాడటానికి ఈ ప్రయత్నం జరిగింది? అనే కోణంలో అనుమానాలు వ్యక్తం కావడంతో, వాటన్నింటిపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఒక ఉన్నత స్థాయి విచారణ కమిషన్ను రంగంలోకి దించాలని నిర్ణయించారు.
గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరాకు సంబంధించి టెండర్ నిబంధనలను అడ్డగోలుగా సడలించడమే కల్తీకి మూల కారణమని కేబినెట్ అభిప్రాయపడింది. అనుభవం లేని సంస్థలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలను మార్చడం ద్వారా, పవిత్రమైన లడ్డూ తయారీలోకి కల్తీ నెయ్యి ప్రవేశించడానికి ద్వారాలు తెరిచారని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ చర్చలో మంత్రి పార్థసారథి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి.
ఆనాడు కొనుగోళ్ల కమిటీలో సభ్యులుగా ఉన్న తనను, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కనీసం సమావేశాలకు కూడా ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. కమిటీలో లేని వ్యక్తులు పెత్తనం చలాయించారు. మాకు సమాచారం ఇవ్వకుండానే రహస్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. కొనుగోళ్ల కమిటీలో సభ్యులు కాని భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారు సమావేశాల్లో పాల్గొని నిబంధనలను మార్చడం దేనికి సంకేతం అని మంత్రి ప్రశ్నించారు.
కల్తీ రసాయనాలు, జంతువుల కొవ్వు ఉన్న నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయడంపై మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భక్తుల మనోభావాలతో ఇంత క్రూరంగా ఆడుకోవడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని మంత్రులు మండిపడ్డారు. ముఖ్యంగా, అయోధ్య రామాలయ ప్రతిష్టాపన సమయంలోనూ ఇదే కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాన్ని పంపడం అత్యంత హేయమైన చర్య అని, ఇది రాష్ట్రానికే కాకుండా దేశానికే మాయని మచ్చ అని కేబినెట్ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది.
ఈ విచారణ కమిషన్ ద్వారా నిందితుల ముసుగులను తొలగించి, వారిని కఠినంగా శిక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ధర్మం గెలవాలన్న ఉద్దేశంతోనే ఈ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు అవసరమైతే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.