Travel- స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా 'కూర్గ్'.. కాఫీ తోటలు, పొగమంచు కొండల సుందర దృశ్యం!
హిల్ స్టేషన్ల రాణి 'ఊటీ'.. వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు బెస్ట్ డెస్టినేషన్!
ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ సఖలేశ్పూర్.. ప్రకృతి ఒడిలో సరికొత్త అనుభూతి!
Hill Stations: ప్రస్తుతం ఎండలు మండిపోతున్న వేళ, వేసవి సెలవులు ముగిసేలోపు ఎక్కడికైనా ఆహ్లాదకరమైన ప్రాంతానికి టూర్ వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారి కోసం దక్షిణ భారతదేశంలో అద్భుతమైన హిల్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి. కొండల మధ్య, పచ్చని ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ పర్యాటక ప్రాంతాలకు వెళితే అక్కడి చల్లటి వాతావరణానికి ముగ్ధులై అసలు తిరిగి ఇంటికి రావాలనిపించనంతగా పర్యాటకులు పరవశించిపోతారు. పశ్చిమ కనుమలు, నీలగిరి కొండల వరుసల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలు వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్లుగా నిలుస్తున్నాయి.
కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో దాగి ఉన్న కూర్గ్ పర్యాటక ప్రాంతం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్లలో ఒకటిగా పేరుగాంచింది. ఈ ప్రాంతం అంతా విస్తారమైన కాఫీ తోటలు, జలపాతాలు, దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉండటం వల్ల దీనిని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు. కూర్గ్లో ప్రసిద్ధ పర్యాటక స్థలాలైన అబ్బే జలపాతం, రాజాస్ సీట్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, తలా కావేరి మరియు నమద్రోలింగ్ మోనాస్టరీలను సందర్శించడంతో పాటు, పచ్చని తోటల మధ్య విహరిస్తూ పర్యాటకులు ట్రెక్కింగ్ కూడా ఆస్వాదించవచ్చు.
హిల్ స్టేషన్స్ రాణిగా పిలవబడే ఊటీ, భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. సముద్రమట్టానికి దాదాపు 2,240 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో నీలగిరి మౌంటెన్ రైల్వే (టాయ్ ట్రైన్) ప్రయాణం పర్యాటకులకు ఒక మరువలేని అనుభూతిని ఇస్తుంది. ఊటీలో ఉన్న ప్రసిద్ధ ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్ మరియు దొడబెట్ట శిఖరాలతో పాటు దీనికి చుట్టుపక్కల ఉండే కూనూర్, పైకారా జలపాతం, అవలాంచ్ సరస్సులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
కర్ణాటకలోని హాసన్ జిల్లా పరిధిలో పశ్చిమ కనుమల మధ్య ఉన్న సఖలేశ్పూర్, ప్రశాంతతను మరియు ప్రకృతిని అమితంగా ఇష్టపడేవారికి ఒక అద్భుతమైన వేదిక. ఈ ప్రాంతాన్ని హాసన్ జిల్లాల ఊటీగా పిలుస్తుంటారు. ఇక్కడి చారిత్రాత్మక మంజరాబాద్ కోటతో పాటు గ్రీన్ రూట్ ట్రెక్కింగ్ పర్యాటకులలో ఎంతో ఫేమస్. అలాగే బిస్లే వ్యూ పాయింట్, మగ్గనహళ్లి జలపాతం, బెట్టద భైరవేశ్వర గుడి వంటి ప్రదేశాలు నిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటాయి.
తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళని కొండలపై సముద్ర మట్టానికి 2,133 మీటర్ల ఎత్తులో ఉన్న కొడైకెనాల్ ప్రాంతాన్ని హిల్ స్టేషన్ల యువరాణిగా పిలుస్తుంటారు. దట్టమైన అడవులు, చల్లని లోయలు, నిరంతరం కురిసే పొగమంచుతో కూడిన ఇక్కడి వాతావరణం పర్యాటకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉండే కొడైకెనాల్ లేక్, కోకర్స్ వాక్, బ్రయంట్ పార్క్, పిల్లర్ రాక్స్, గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్లు పర్యాటక ప్రేమికులకు ఖచ్చితంగా చూడదగ్గ ప్రదేశాలుగా నిలుస్తున్నాయి.