5 కిలోల LPG సిలిండర్లు పొందేందుకు మారిన రూల్స్..
ఇక నుండి అడ్రస్ ప్రూఫ్ లేకుండానే..
దేశంలో ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న 5 కిలోల LPG సిలిండర్ల విక్రయం మరియు లభ్యతను దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద సరైన గుర్తింపు పత్రం చూపించి సులభంగా కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడుతున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం విశేషం. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంటగ్యాస్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG (FTL) సిలిండర్ కొనడానికి అడ్రసు ప్రూఫ్ అవసరం లేదు. వలస కార్మికులు, స్థిర నివాసం లేని వారికి ఇది పెద్ద ఉపశమనం. కేవలం ఒక గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది.
క్రింది వాటిలో ఏదైనా ఒకటి చూపిస్తే సిలిండర్ పొందవచ్చు:
ఆధార్ కార్డు
పాన్ కార్డు
డ్రైవింగ్ లైసెన్స్
ఓటర్ ఐడీ
రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు పత్రం
ప్రభుత్వం 5 కిలోల సిలిండర్ల సరఫరాను గణనీయంగా పెంచింది. మార్చి 23 నుండి ఇప్పటివరకు సుమారు 6.6 లక్షల సిలిండర్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 4 ఒక్కరోజే 90 వేలకుపైగా సిలిండర్లు విక్రయమయ్యాయి.
అంతేకాకుండా ఒకే రోజులో 51 లక్షలకు పైగా గృహ LPG సిలిండర్లు సరఫరా చేయబడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మొత్తం డిమాండ్లో 95% వరకు ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే వస్తున్నాయి.
వలస కార్మికులు మరియు ఇతర అవసరమైన వర్గాలకు సహాయం చేయడానికి HPCL అవుట్లెట్లలో 11 ప్రత్యేక హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. ఇవి సమీప గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వివరాలు తెలియజేసి సులభంగా సిలిండర్ పొందేలా మార్గనిర్దేశం చేస్తాయి.
LPG సరఫరాలో అక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మార్చి నుంచి ఇప్పటివరకు 50,000కిపైగా సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 1,400కి పైగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, 36 డీలర్షిప్లను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం గృహ వినియోగం మరియు ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర రంగాలకు LPG సరఫరాకు ప్రాధాన్యత ఇచ్చారు. వాణిజ్య LPG సరఫరాను 70% వరకు పరిమితం చేయడం జరిగింది.
సహజ వాయువు (PNG) సరఫరా గృహాలు మరియు రవాణా రంగానికి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. ఎరువుల కర్మాగారాలకు సరఫరా కూడా ఏప్రిల్ 6 నుంచి సుమారు 90% వరకు పెరిగిందని అధికారులు తెలిపారు.
మొత్తంగా చూస్తే, ఇంధన సంక్షోభ పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వంటగ్యాస్ అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపశమనం కలిగిస్తున్నాయి.