ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కోనసీమ సంక్రాంతి సంబరాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందేలు.
ఈ సారి కూడా భారీ ఎత్తున కోడిపందేలు జరిగాయి. రెండు రోజుల్లోనే దాదాపు 20 కోట్ల మేర చేతులు మారాయి. పందెం రాయుళ్లు సమయం, జాతకం, ముహూర్తం చూసుకుని మరీ కోళ్లను బరిలోకి దింపుతున్నారు. ఇక, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జోరుగా కోడిపందేలు జరుగుతున్నాయి. నిన్న (గురువారం) పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి.
ఓ వ్యక్తి కోడిపందెంలో ఏకంగా 1.53 కోట్ల రూపాయలు గెలిచాడు. రాజమండ్రి రమేష్ అనే వ్యక్తి ఈ రికార్డు సృష్టించాడు. గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ కోళ్ల మధ్య భారీ పందెం జరిగింది. రాజమండ్రి రమేష్ కోడి ప్రభాకర్ కోడిని చిత్తుచిత్తుగా ఓడించింది.
దీంతో రమేష్ 1.53 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతి పెద్ద పందెం అని స్థానికులు అంటున్నారు. ఇక, కోనసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందర్బంగా కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది.