వేసవి ముందస్తు రాక
ఏపీలో ఎండల సెగ
ఆ ప్రాంతాలు చలి ఎక్కువ
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి.గత నెల రోజులుగా వణికించిన చలి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, పగటి ఉష్ణోగ్రతలు వేగంగా పుంజుకుంటున్నాయి. ఫిబ్రవరి రెండో వారం ప్రవేశించీ ప్రవేశించక ముందే వేసవి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాయువ్య మరియు ఈశాన్య దిశల నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తాజా బులెటిన్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర యానాం ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, పగటిపూట ఎండ తీవ్రత పెరుగుతున్నప్పటికీ, రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల పగలు వేడిగా, రాత్రిళ్లు చల్లగా ఉండే విలక్షణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా చలి ప్రభావం గణనీయంగా తగ్గింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం, ప్రస్తుతం దిగువ స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగనుంది. హైదరాబాద్ నగరం సహా చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ, ప్రజలకు వేసవి వేడిని రుచి చూపిస్తున్నాయి. తెల్లవారుజామున మాత్రమే స్వల్పంగా చలి గాలులు వీస్తున్నాయి.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమ మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం పూట దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం వరకు ఈ పొగమంచు ప్రభావం ఉంటుందని అంచనా. దీనివల్ల రహదారులు సరిగ్గా కనిపించి కనిపించినట్లుగా కనిపిస్తాయని తెలిపారు ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం అధికంగా ఉండనుంది. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారు తెల్లవారుజామున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
వాతావరణంలో సంభవిస్తున్న ఈ ఆకస్మిక మార్పుల పట్ల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట ఎండ, రాత్రివేళ చలి ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిపై ప్రభావం పడి జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు ప్రజలు తగినన్ని నీళ్లు తాగుతూ శరీరంలో ద్రవ పదార్థాల శాతం తగ్గకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.