AP Census 2026: దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనగణన (సెన్సస్) ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ కీలక వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16వ తేదీ నుంచి గృహ గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి గణనలో అనేక మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.
మొదటి దశలో భాగంగా చేపట్టే ఈ గృహ గణనలో మొత్తం 33 రకాల అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు నివాస గృహాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు నమోదు చేసుకుంటారు. మొదటి దశ విజయవంతంగా ముగిసిన తర్వాత రెండో దశలో అసలైన జన గణన ప్రక్రియ మొదలవుతుంది. ఈ రెండో దశలోనే అత్యంత కీలకమైన కుల గణనను కూడా కలిపి నిర్వహించబోతుండటం గమనార్హం. దీనివల్ల జనాభా లెక్కలతో పాటు సామాజిక వివరాలు కూడా స్పష్టంగా అందుబాటులోకి వస్తాయి.
ఈసారి జనాభా గణనను పాత పద్ధతిలో కాకుండా పూర్తిగా డిజిటల్ రూపంలో నిర్వహించనున్నారు ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను కూడా రూపొందించింది. గణన కోసం వచ్చే సిబ్బంది తమ సొంత మొబైల్ ఫోన్లను వాడుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ సరిగ్గా లేని ప్రాంతాల్లో కూడా ఇబ్బంది కలగకుండా ఈ యాప్ను ఆఫ్లైన్ విధానంలో కూడా పనిచేసేలా తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా ఉన్న సిబ్బందికి ఈ డిజిటల్ ప్రక్రియపై ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
కేవలం సిబ్బంది మాత్రమే కాకుండా, పౌరులు తమంతట తామే వివరాలు నమోదు చేసుకునేందుకు స్వయం నమోదు సౌకర్యాన్ని కల్పించారు. దీనికోసం ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు తమ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి, ఒక ఐడీని పొంది తమ కుటుంబ వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చు. ప్రజల భాషా సమస్యలు రాకుండా ఈ యాప్ ప్రశ్నావళిని తెలుగుతో పాటు దేశంలోని ప్రధాన 16 నుంచి 19 భాషల్లో అందుబాటులో ఉంచారు.
జనాభా వివరాల భద్రతపై రిజిస్ట్రార్ జనరల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. గణన ద్వారా సేకరించే డేటా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పొక్కకుండా, డేటా లీక్ అవ్వకుండా అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.