AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. పరీక్షలు రాయడం ఒక ఎత్తయితే, రాసిన జవాబు పత్రాలు సరిగ్గా దిద్దడం మరో ఎత్తు. గతంలో మూల్యాంకనం సమయంలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ, పాఠశాల విద్యాశాఖ ఈసారి కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. జవాబు పత్రాల దిద్దుబాటులో టీచర్లు గనుక నిర్లక్ష్యం వహిస్తే, వారి జేబులకు చిల్లు పడటం ఖాయమని ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. ఆ వెంటనే అంటే ఏప్రిల్ 4వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కానుంది. వారం రోజుల పాటు అంటే ఏప్రిల్ 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ లోపు ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదని విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సాధారణంగా ఇంటర్మీడియట్ పేపర్ల దిద్దుబాటులో తప్పులు దొర్లితే జరిమానా విధించే పద్ధతి ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని పదో తరగతికి కూడా వర్తింపజేస్తున్నారు. మార్కులు కలపడంలో తప్పులు చేసినా, ఒక ప్రశ్నకు వేయాల్సిన మార్కులు వేయకపోయినా, లేదా రీ-వెరిఫికేషన్లో మార్కుల తేడా వచ్చినా సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే భారీగా జరిమానా (Penalty) విధించడమే కాకుండా, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతంలో పేపర్ మీద మార్కులు వేసి, ఆ తర్వాత కంప్యూటర్లలో ఎక్కించేటప్పుడు కొన్ని పొరపాట్లు జరిగేవి. ఈసారి ఆ సమస్య లేకుండా సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. మూల్యాంకనం చేసిన వెంటనే మార్కులను ట్యాబ్లలో (Tabs) నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ ఎవరైనా టీచర్ పదే పదే తప్పులు చేస్తున్నట్లు సాఫ్ట్వేర్ గుర్తిస్తే, వెంటనే ఆ రిపోర్టును పై అధికారులకు పంపిస్తారు. సదరు టీచర్కు నోటీసులు ఇచ్చి వివరణ కోరిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,415 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 33,882 మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కూడా కల్పించారు. పరీక్షా కేంద్రాల్లో ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థులకు మొదట 24 పేజీల బుక్లెట్ ఇస్తారు, అవసరమైతే అదనంగా మరో 12 పేజీల బుక్లెట్ కూడా అందుబాటులో ఉంచారు. మొత్తం మీద, విద్యార్థులు కష్టపడి రాసిన ప్రతి మార్కు వారికి దక్కాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.