Tirupati Latest News: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై అన్నదానం మరింత వేగవంతం చేస్తూ, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ వంటశాలను నిర్మించనుంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ సహకారంతో సుమారు రూ.120 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
గత నాలుగు దశాబ్దాలుగా తిరుమలలో నిరంతరాయంగా ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అయితే, ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ఉన్న తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, వంట చేసే విధానం నుంచి భక్తులకు వడ్డించే వరకు అన్ని దశల్లోనూ ఆటోమేషన్ (యంత్రాల వినియోగం) తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది.
ఈ కొత్త కిచెన్లో గంటకు 3 టన్నుల అన్నం, సాంబారు తయారు చేయగల సామర్థ్యం ఉన్న భారీ బాయిలర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న యంత్రాలు 15 ఏళ్ల నాటివి కావడంతో తరచూ రిపేర్లు వస్తున్నాయి. కొత్తగా నిర్మించే అదనపు భవనాల్లో కేవలం వంటశాల మాత్రమే కాకుండా, భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని తినేలా డైనింగ్ హాళ్లను కూడా నిర్మించనున్నారు. దీనివల్ల భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.
గతేడాది తిరుమల పర్యటనకు వచ్చిన రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి టీటీడీ అధికారులు తమ మాస్టర్ ప్లాన్ను వివరించారు. ఈ గొప్ప కార్యానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా రిలయన్స్ సంస్థ రూ.120 కోట్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రాగా, ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు పాలకమండలి అధికారికంగా ఆమోదం తెలిపింది.
సాంకేతికతను జోడించడం వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్ని వంటకాలను కొత్త పద్ధతిలో తయారు చేయనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న ఈ వంటశాల, దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక అన్నదాన కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది.