తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై హిందూ ధార్మిక సంఘాల నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో హిందూ సంఘ నేతలు ఓంకార్, మునిబాబు మాట్లాడుతూ.. భూమన కరుణాకర్ రెడ్డి హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆయన కుమార్తె నిశ్చితార్థం క్రైస్తవ పద్ధతిలో జరగడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కరుణాకర్ రెడ్డి నిజంగా హిందువు అయితే తన కుటుంబ వేడుకలను అన్యమత పద్ధతుల్లో ఎందుకు నిర్వహించారని వారు ప్రశ్నించారు. ఆయన ఒక నాస్తికుడని, హిందూ ధర్మంపై ఆయనకు గౌరవం లేదని వారు మండిపడ్డారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా పెద్ద ఎత్తున కుట్రలు జరిగాయని హిందూ సంఘాలు ఆరోపించాయి. ప్రధాన ఆలయం ముందే స్టేజీలు వేసి అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి భజన చేయడం ఏంటని వారు నిలదీశారు. గత ఐదేళ్ల కాలంలో భక్తులకు కల్తీ లడ్డూలు ఇచ్చి వారి నమ్మకంతో ఆడుకున్నారని, వెంకటేశ్వర స్వామి నామాన్ని వారథిపై నుండి తొలగించిన చరిత్ర భూమనకు ఉందని వారు గుర్తు చేశారు. కనీసం ఏనాడైనా ఆయన స్వామి వారి నామం పెట్టుకున్నారా లేదా గుండు చేయించుకున్నారా అని వారు ఘాటుగా ప్రశ్నించారు.
ధార్మిక క్షేత్రాల్లో భూమన ప్రవర్తన ఏమాత్రం సరిగ్గా లేదని నేతలు విమర్శించారు. వెంగమాంబ గుడి నిర్మాణం జరుగుతున్న సమయంలో కరుణాకర్ రెడ్డి చెప్పులు వేసుకుని లోపలికి వెళ్లడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వ నేతలు చేసిన తప్పుల వల్లనే తిరుపతి నగరం ప్రకృతి వైపరీత్యాలకు గురైందని, గోవిందరాజ స్వామి గుడిని తాకినందుకే వాయు, అగ్ని, వాన దేవుళ్లు ఆగ్రహించారని వారు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా హిందువులు ఐదేళ్ల పాటు ఎంతో సంయమనంతో ఉన్నారని వారు గుర్తు చేశారు.
ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు చేస్తున్న ప్రక్షాళన పనులను అడ్డుకోవడానికే వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని హిందూ సంఘాలు ధ్వజమెత్తాయి. బి.ఆర్. నాయుడు పదవి చేపట్టిన తర్వాత సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందుతున్నాయని, గతంలో జరిగిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతోనే ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో మతమార్పిడులు అన్యమత ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రస్తుత పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని వారు స్పష్టం చేశారు.
చివరగా, భూమన కరుణాకర్ రెడ్డి అసలు తిరుపతి వాసి కాదని, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడి రాజకీయాలు చేస్తున్నారని హిందూ సంఘ నేతలు విమర్శించారు. ఇక్కడి సంప్రదాయాలను, భక్తిని గౌరవించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడటమే తమ లక్ష్యమని, అన్యమతస్థుల పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వారు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా తిరుమల ప్రక్షాళనకు తాము పూర్తి మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా ఓంకార్ మునిబాబు వెల్లడించారు.