ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి పండగ సందర్భంగా ఆనందవార్త అందించారు. రాష్ట్రంలోని ఆర్టీసీ సిబ్బందికి పండుగ కానుకగా ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సిబ్బంది ఎదుర్కొంటున్న పలు సమస్యలు, పెండింగ్లో ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వడంతో పాటు దీపావళి నాటికి పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే కింది స్థాయి విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి గౌరవప్రదమైన డిజిగ్నేషన్లు ఇవ్వనున్నట్లు కూడా వెల్లడించారు.
ఆగస్టు నెలలోనే ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలైలో ప్రభుత్వానికి చేరిన ప్రమోషన్ ఫైల్ ఆగస్టు 23న సీఎం వద్దకు చేరగా, ఆయన ఆగస్టు చివర్లోనే ఆమోదం తెలిపారు. అయితే ఫైల్కు ఆమోదం లభించినప్పటికీ జీవో విడుదలలో రెండు నెలలుగా ఆలస్యం జరుగుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తామని ప్రకటించడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది. ఉద్యోగ సంఘాల నేతలు దీన్ని సీఎం తీసుకున్న ఉద్యోగ హిత నిర్ణయంగా అభివర్ణించారు.
ఆర్టీసీ సిబ్బందికి ఈ ప్రమోషన్లు మూడేళ్లకు పైగా ఎదురుచూస్తున్న సంతోషాన్ని కలిగించనున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, గ్యారేజ్ ఉద్యోగులు ఇలా అన్ని విభాగాల్లో అర్హులైన వారికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది. డ్రైవర్లు, కండక్టర్లకు కంట్రోలర్ లేదా అసిస్టెంట్ డిపో క్లర్క్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్)గా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. గ్యారేజ్ విభాగంలో డిప్యూటీ మెకానిక్స్ నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ (మెకానికల్ ఫోర్మెన్) స్థాయికి పదోన్నతి లభించనుంది. అదేవిధంగా పర్సనల్, స్టోర్స్, ఫైనాన్స్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా పదోన్నతులు దక్కనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు ఈ ప్రమోషన్ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. జీవో విడుదలలో జాప్యం కారణంగా ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయాన్ని పలుమార్లు సందర్శించినప్పటికీ స్పష్టత రాలేదు. చివరికి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. దీపావళి పండుగ సందర్భంగా ఈ నిర్ణయం ఆర్టీసీ కుటుంబాలకు నిజమైన పండుగ కానుకగా మారనుంది. ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యమంత్రి నాయుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.