సినిమా విడుదలకు ముందే హై క్వాలిటీతో ఆన్లైన్లో లీక్..
యాంటీ పైరసీ భాగస్వామిగా పనిచేస్తున్న ఈరోడ్కు చెందిన WarX సంస్థ..
ప్రముఖ నటుడు దళపతి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా విడుదలకు ముందే హై క్వాలిటీతో ఆన్లైన్లో లీక్ కావడం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఈ ఘటన నిర్మాతలకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
ఈ సినిమాకు యాంటీ పైరసీ భాగస్వామిగా పనిచేస్తున్న ఈరోడ్కు చెందిన WarX సంస్థ, లీక్ వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించే పనిలో పడింది. సంస్థ సీఈఓ రామేశ్ ఎస్. ప్రకారం, టోరెంట్ల ద్వారా సినిమా డౌన్లోడ్ చేస్తున్న వారి IP అడ్రెస్లను కూడా సేకరిస్తున్నామని తెలిపారు.
ఈ చిత్రాన్ని నిర్మించిన బెంగళూరు కేంద్రంగా ఉన్న కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం, ప్రచారం చేపట్టినా, లీక్ కారణంగా సినిమా విడుదల కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.
2023లో సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952లో చేసిన సవరణల ప్రకారం, సినిమా పైరసీకి పాల్పడిన వారిపై మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు, సినిమా మొత్తం ఖర్చులో 5 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ కేసు ఈ కొత్త చట్టానికి పెద్ద పరీక్షగా మారే అవకాశముంది.
లీక్ అయిన సినిమా క్లిప్లు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. చాలా పోస్టులను తొలగించినప్పటికీ, పలు టోరెంట్ వెబ్సైట్లు ఇంకా అందుబాటులో ఉండటం నిర్మాతలకు మరో సమస్యగా మారింది. కొన్ని సైట్లు చట్టపరమైన చర్యలకు సహకరిస్తున్నా, మరికొన్ని విదేశీ సర్వర్లలో ఉండటం వల్ల నియంత్రించడం కష్టమవుతోంది.
ఇక తరచూ డొమైన్ పేర్లు మార్చుకుంటూ కొనసాగుతున్న TamilMV వంటి సైట్లను ఇప్పటికే వందలసార్లు బ్లాక్ చేసినా, కొత్త లింకులతో మళ్లీ అందుబాటులోకి వస్తున్నాయి.
అలాగే టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్స్లో ప్రైవేట్ గ్రూపుల ద్వారా కూడా సినిమా షేరింగ్ జరుగుతోంది. ఈ గ్రూపులను గుర్తించడం, బ్లాక్ చేయడం కొంత క్లిష్టంగా మారింది.
టోరెంట్ల ద్వారా సినిమా డౌన్లోడ్ చేసే వారి IP అడ్రెస్లు సులభంగా బయటపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇటువంటి వినియోగదారులపై చర్యలు తీసుకుంటారు. అయితే భారత్లో అలాంటి చర్యలు ఎంతవరకు అమలు అవుతాయన్నది ఇంకా స్పష్టత లేదు.
ఇప్పటికైనా పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సినీ వర్గాలు కోరుతున్నాయి. మరోవైపు, ఈ లీక్ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.