Jana Nayagan Movie Piracy: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న భారీ చిత్రం 'జన నాయకన్ విడుదలకు ముందే లీక్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతోంది. సినిమాలోని కీలకమైన టైటిల్ కార్డ్స్, విజయ్ ఇంట్రడక్షన్ సీన్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్కు గురైంది. షూటింగ్ పూర్తి చేసుకుని, సెన్సార్ చిక్కులతో ఇప్పటికే ఆలస్యమవుతున్న ఈ సినిమాపై ఇలాంటి పైరసీ దాడి జరగడం పట్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా స్పందిస్తోంది. సినిమాను వెండితెరపై చూసి ఆస్వాదించాలని, ఇలాంటి లీకులను ప్రోత్సహించవద్దని సినీ ప్రముఖులు కోరుతున్నారు.
ఈ ఘటనపై టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో తన సినిమాల విషయంలోనూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నారు. "జన నాయకన్ లీక్ వార్త నన్ను చాలా బాధిస్తోంది. కెరీర్ మొదట్లో నా సినిమా లీక్ అయినప్పుడు నేను ఎంత మానసిక వేదన అనుభవించానో నాకు తెలుసు. ఇది కేవలం ఒక హీరో సమస్య కాదు ఆ సినిమా వెనుక ఉన్న దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్ల ఏళ్ల కష్టం ఉంటుంది. దీన్ని ఒక వ్యవస్థాపరమైన వైఫల్యంగా భావించాల్సి ఉంటుంది. బాధ్యులను త్వరగా పట్టుకోవాలి" అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే కాకుండా, సౌత్ ఇండియాలోని దిగ్గజ నటులందరూ ఈ లీక్ను తీవ్రంగా ఖండించారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. "సినిమా అనేది ఎందరో కళాకారుల రక్తం, చెమట. పైరసీని అంతం చేసి సినిమాను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. అటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, సెన్సార్ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం వల్ల కూడా ఇలాంటి లీకులకు ఆస్కారం దక్కుతోందని అభిప్రాయపడ్డారు.
సినిమా మేకర్స్ కథనం ప్రకారం, ఈ లీక్ ఎడిటింగ్ రూమ్ నుంచే జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎవరో మానిటర్ ముందు కూర్చుని వీడియోను పాజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయ్ చివరి చిత్రం కావడంతో అభిమానుల్లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం, సినిమాలోని రాజకీయ అంశాల వల్ల సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని ఎలక్షన్ కమిషన్ పరిశీలనకు పంపింది. దీనివల్ల సంక్రాంతికే విడుదల కావాల్సిన సినిమా నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో లీక్ రూపంలో మరో దెబ్బ తగలడం చిత్ర బృందాన్ని కలవరపెడుతోంది. సినిమా ప్రేమికులంతా ఇలాంటి లీక్ వీడియోలను షేర్ చేయకుండా, థియేటర్లలోనే సినిమాను చూడాలని సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.