సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘ధురంధర్ 2’ సినిమాపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్, నటి యామీ గౌతమ్ దంపతులను వర్మ స్వయంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, సినిమా మేకింగ్ విషయంలో ఆదిత్య ధర్ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారని కొనియాడారు. రణవీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ విజన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సినిమా గురించి వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ‘ధురంధర్ 2’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, పాతకాలపు మూస ధోరణిలో సినిమాలు తీసే దర్శకులకు ఇదొక హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. కేవలం భారీ శబ్దాలు, విపరీతమైన మసాలా సీన్లతో ప్రేక్షకులను మెప్పించాలనుకునే కాలం చెల్లిపోయిందని వర్మ విశ్లేషించారు. మెదడుకు పని చెప్పకుండా, లాజిక్ లేని యాక్షన్ సీన్లతో కాలక్షేపం చేసే సినిమాలకు ఈ చిత్రం ఫుల్స్టాప్ పెట్టిందని ఆయన గట్టిగా చెప్పారు.
ముఖ్యంగా హీరో పాత్రను చూపించిన విధానంపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో హీరోకు దెబ్బ తగిలితే రక్తం రావడం, అతను నొప్పితో విలవిలలాడటం వంటి సహజమైన అంశాలను చూపించడం గొప్ప విషయమని కొనియాడారు. గాలిలో ఎగిరే ఫైట్లు, ఫిజిక్స్కు అందని స్టంట్లు చేసే ‘సూపర్ హీరో’ల కంటే, రక్తమాంసాలతో ఉండి తెలివితేటలతో శత్రువును ఓడించే హీరోనే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారని వర్మ స్పష్టం చేశారు. రణవీర్ సింగ్ పోషించిన ‘హంజా’ పాత్ర ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను ఆకాశానికెత్తుతూ.. టెర్రరిస్టుల నుంచి తప్పించుకోవచ్చు కానీ, ఆదిత్య ధర్ మేధస్సు నుంచి ఇతర దర్శకులు తప్పించుకోలేరని వర్మ చమత్కరించారు. కేవలం కాస్ట్యూమ్స్, బాడీ బిల్డింగ్తో హీరోలను సృష్టించే దర్శకులు ఇకనైనా మేల్కోవాలని సూచించారు. కథలో లోతు, పాత్రల మనస్తత్వానికి ప్రాధాన్యత ఇస్తేనే సినిమాలు ఆడుతాయని ఈ చిత్రం నిరూపించిందన్నారు. షూటింగ్లో ఉన్న ఇతర దర్శకులు కూడా ఈ సినిమాను చూసి పాఠాలు నేర్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
ఇక బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం 250 కోట్ల రూపాయల మార్కును దాటేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. పాకిస్థాన్లో గూఢచారిగా వెళ్లి ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. రణవీర్ సింగ్తో పాటు అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటుల నటన సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది.