భారత్-కెనడా వాణిజ్య సంబంధాలకు విశ్వాసమే బలం..
సీఈపీఏతో భారత్-కెనడా మధ్య కొత్త పెట్టుబడి అవకాశాలు..
కెనడాలో భారత్-కెనడా ఆర్థిక భాగస్వామ్యంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య నమ్మకం మరింత బలపడుతున్న నేపథ్యంలో, భవిష్యత్లో భారత్-కెనడా ఆర్థిక సంబంధాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
టొరంటోలో జరిగిన ‘ఫ్రం పొలిటికల్ రీసెట్ టు కమర్షియల్ డెలివరీ’ అనే మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొన్న పీయూష్ గోయల్, భారత్-కెనడా సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. పరస్పర విశ్వాసం పెరగడంతో వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయని తెలిపారు.
భారత్-కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మరింత విస్తరించడమే కాకుండా, పలు రంగాల్లో సహకారానికి కొత్త మార్గాలు ఏర్పడతాయని చెప్పారు.
భారత్-కెనడా సంబంధాల బలానికి వైవిధ్యమే ప్రధాన కారణమని గోయల్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న అనుబంధం, వ్యాపార సహకారం, విద్యా మరియు సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం ఈ సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయని అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే మూడు దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్ విశ్వసనీయ భాగస్వామిగా మారిందని, భవిష్యత్లో మరిన్ని అంతర్జాతీయ అవకాశాలు దేశానికి లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.