TANTEX: డాలస్‌లో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 224వ సదస్సు!

Telugu Association Texas: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX), ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 224వ సదస్సును డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించింది. సదస్సులో పాల్గొన్న పలువురు సాహితీ ప్రముఖులు.

Published : 2026-04-01 10:54:00

‘నెల నెలా తెలుగు వెన్నెల’ 224వ సదస్సు…

పాల్గొన్న ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత వల్లూరు మధుసూదన రావు…

తెలుగు భాషా సాహితీ సుగంధాన్ని విస్తరింపజేస్తున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX), తన ప్రతిష్టాత్మక సాహిత్య వేదిక ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 224వ సదస్సును 2026 మార్చి 22న డాలస్ నగరంలో వైభవంగా నిర్వహించింది. గత 18 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సాహిత్య కార్యక్రమం, ఈసారి ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత వల్లూరు మధుసూదన రావు (షాడో మధుబాబు) పాల్గొనడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

కార్యక్రమానికి సాహిత్య వేదిక సమన్వయకర్త, పాలకమండలి అధిపతి దయాకర్ మాడా స్వాగతం పలుకుతూ సభను ప్రారంభించారు. అనంతరం చిరంజీవి కుమారి సమన్విత మాడా ‘రామా నన్ను బ్రోవరా’ అనే ప్రార్థన గీతాన్ని మధురంగా ఆలపించి సభకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించారు. దివంగత కవి వడ్డేపల్లి కృష్ణ రచించిన ‘నెల నెలా-తెలుగు వెన్నెలా’ గీత ప్రాముఖ్యతను దయాకర్ మాడా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు.

‘షాడో’ మధుబాబు అనుభవాలు 
ముఖ్య అతిథిగా పాల్గొన్న షాడో మధుబాబు జూమ్ ద్వారా తన 50 ఏళ్ల సుదీర్ఘ రచనా ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు వంటి ప్రముఖ రచయితల చారిత్రక నవలలు, కాశీ మజిలీ కథలు, అలాగే ఆంగ్ల సాహిత్యం తన రచనా శైలిపై ప్రభావం చూపాయని చెప్పారు.

‘డిటెక్టివ్ షాడో’ పాత్ర ద్వారా పాఠకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన తాను, కాలానుగుణంగా జానపద రచనల వైపు మళ్లి పాఠకులను అలరిస్తున్నానని తెలిపారు. చివరి శ్వాస వరకు రచనలు చేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేయడం సభలో ఉత్సాహాన్ని నింపింది. సభాధ్యక్షుడు దయాకర్ మాడా అడిగిన క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఆయన స్పష్టంగా, ఓపికగా సమాధానాలు ఇచ్చి సాహితీ ప్రియులను మెప్పించారు.

సాహితీ ప్రముఖుల సందేశాలు 
ఈ సదస్సులో పలువురు సాహితీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

డాక్టర్ బీరం సుందరావు ‘సాహిత్యంలో చమత్కారాలు’ అంశంపై ఆసక్తికరంగా మాట్లాడారు.
కవి త్యాగరాజు నాటక శైలిలో పద్యాలను ఆలపించి అందరినీ అలరించారు.
టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, మధుబాబు రచనా ప్రతిభను ప్రశంసించారు.
అక్కిరాజు సుందర రామకృష్ణ తన గంభీర స్వరంతో పద్యాలను వినిపించి సభను రంజింపజేశారు.

ఇక డాక్టర్ తోటకూర ప్రసాద్, ప్రొఫెసర్ పూదూరు జగదీశ్వరన్ వంటి అనేకమంది సాహితీ ప్రముఖులు కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేశారు.

కార్యక్రమం చివర్లో దయాకర్ మాడా వందన సమర్పణ చేస్తూ, టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పాలకమండలి సభ్యులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాషా పరిరక్షణకు టాంటెక్స్ చేస్తున్న సేవలను డాలస్ తెలుగు సమాజం ప్రశంసించింది. 

Spotlight

Read More →