నీటి సంరక్షణకు వంద రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
వాటర్ బడ్జెట్- వాటర్ ఆడిట్ అనేది కీలకం..
అమరావతి: రాష్ట్ర అభివృద్ధికి నీటి భద్రతే పునాది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.
నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై సీఎం టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, సాగునీటి సంఘాలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయతీరాజ్, అటవీ, పశు సంవర్థక శాఖలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
వంద రోజుల కార్యాచరణ – నాలుగు దశల్లో అమలు
నీటి సంరక్షణ కోసం సీఎం 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు నాలుగు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు:
ఏప్రిల్ 6–15: పనుల గుర్తింపు
ఏప్రిల్ 16–20: పరిపాలనా అనుమతులు
ఏప్రిల్ 21–జూలై 9: పనుల అమలు
జూలై 10–14: నివేదికలు సమర్పణ
సాగునీటి సంఘాల 60 వేల మంది సభ్యులు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలని సీఎం బాధ్యతలు అప్పగించారు.
నీటి ప్రతి చుక్క విలువైనదే
ప్రతి నీటి బొట్టును సంరక్షించాలని సీఎం సూచించారు. వేసవి ప్రారంభానికి ముందు 6 మీటర్ల లోతులో, వర్షాకాలం ముగిసే నాటికి 3 మీటర్ల లోతులో భూగర్భజలాలు అందుబాటులో ఉండేలా లక్ష్యాలు నిర్దేశించారు. రాష్ట్రంలోని 5697 గ్రామాల్లో భూగర్భజలాల కొరత ఉందని గుర్తించామని తెలిపారు. చెరువులు నింపడం ద్వారా కనీసం 1.5 మీటర్ల మేర భూగర్భజల మట్టాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
చెరువులు, కాల్వలు శుభ్రపరిచే పనులు
కాల్వలు, చెరువులు, చెక్ డ్యాంలను మరమ్మతులు చేసి నీటి నిల్వకు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఫీడర్ ఛానెల్స్ క్లియర్ చేయడం, పూడికలు తొలగించడం, గుర్రపు డెక్క ఆకులను తొలగించడం వంటి పనులు చేపట్టాలని సూచించారు. దీంతో వరద ముప్పు తగ్గడంతో పాటు నీటి నిల్వ పెరుగుతుందని తెలిపారు.
వాటర్ బడ్జెట్ – వాటర్ ఆడిట్ కీలకం
సాగునీటి సంఘాలు వాటర్ బడ్జెట్ తయారు చేయడంతో పాటు వాటర్ ఆడిట్ కూడా నిర్వహించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా చెరువుల మ్యాపింగ్ చేసి, హైడ్రాలజీ మ్యాప్లను విశ్లేషించి నీటి వనరులను అనుసంధానించాలని సూచించారు.
భూగర్భ జలాల పెంపుపై ఫోకస్
భూగర్భజలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. మైక్రో ఇరిగేషన్ విధానాలను అమలు చేసి ప్రతి చుక్క నీటిని సమర్థంగా వినియోగించాలని సూచించారు.
‘ప్రాజెక్టు జలధార’ స్పూర్తితో ముందుకు
అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన ‘ప్రాజెక్టు జలధార’ను ఆదర్శంగా తీసుకుని వాగులు, వంకలు, ఇతర నీటి వనరులను అనుసంధానించాలని సీఎం పిలుపునిచ్చారు. నీటి సంరక్షణ చర్యలను ప్రతి గ్రామంలో అమలు చేయాలని సూచించారు.
గ్రామస్థాయిలో సమన్వయం
రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటవుతుందని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, గ్రామస్థాయిలో సర్పంచ్ల ఆధ్వర్యంలో పనులు జరుగుతాయని తెలిపారు. సాగునీటి సంఘాలు ఈ కార్యక్రమానికి డ్రైవింగ్ ఫోర్స్గా ఉండాలని పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యం కీలకం
నీటి భద్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని సీఎం చెప్పారు. ప్రతి ఎకరాకు నీరు అందించటం, ప్రతి రైతుకు భరోసా కల్పించటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు.
ఈ వంద రోజుల యాక్షన్ ప్లాన్ను అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుండి ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. గత ప్రభుత్వంలో నీటి సంరక్షణను నిర్లక్ష్యం చేశారని విమర్శిస్తూ, ఇప్పుడు ప్రజలు, అధికారులు కలిసి పనిచేస్తేనే ఫలితం వస్తుందని పేర్కొన్నారు. నీటిని నిల్వ చేయడం, పొదుపు చేయడం, భవిష్యత్తు తరాలకు సంరక్షించడం—ఇదే ఈ కార్యక్రమం అసలు ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు.