- Politics: కిక్కిరిసిన తరగతులు.. చెట్ల కిందే పాఠాలు: ఎమ్మిగనూరు బాలికల పాఠశాలలో గదుల కొరత..
- ల్యాబ్లు, లైబ్రరీల్లోనూ తరగతుల నిర్వహణ: ఎమ్మిగనూరు పాఠశాలలో విద్యా కుసుమాల ఇబ్బందులు..
AP Govt: ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను పరిశీలించినా.. విద్యార్థినుల సంఖ్య అధికంగానే కనిపిస్తోంది. విద్యపై సమాజంలో పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో బాలికా విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. మన విద్యా వ్యవస్థలో మరో ఆసక్తికర అంశం కూడా కనిపిస్తోంది. ప్రభుత్వ బడుల్లో బాలురు కంటే బాలికల సంఖ్య ఎక్కువగా ఉండగా.. ప్రైవేటు విద్యా సంస్థల్లో బాలికల కంటే బాలురు సంఖ్య అధికంగా ఉంది. ఇది మన సమాజం ఆలోచనలు, ఆర్ధిక పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రాధమిక స్థాయిలో బాలబాలికల వ్యత్యాసం తక్కువగానే ఉన్నా.. ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చేసరికి ప్రభుత్వ బడుల్లో బాలికలు, ప్రైవేటులో బాలుర సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ, ఎయిడెడ్లో కలిపి ఈ ఏడాది బాలికలు 17.34 లక్షల మంది ఉండగా.. బాలురు 15.47 లక్షల మంది ఉన్నారు.
ప్రైవేటులో బాలురు 19.81 లక్షల మంది ఉండగా.. బాలికలు 15.59 లక్షల మంది చదువుతున్నారు. 'ఈనాడు ప్రతినిధి' క్షేత్రస్థాయి పర్యటనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బాలికల ఉన్నత పాఠశాలల్లో అత్యధికంగా విద్యార్థినులు చదువుతున్నారు. ఒక్క ఎమ్మిగనూరులోని మాచాని సోమప్ప బాలికల ఉన్నత పాఠశాలలో 3,323 మంది విద్యార్థినులున్నారు. డోన్ బాలికల ఉన్నత పాఠశాలలో 1,522 మంది, కోసిగి బాలికల పాఠశాలలో 1,463, వెల్దుర్తి బాలికల పాఠశాలలలో 1,137, ఆదోని బాలికల ఉన్నత పాఠశాలలో 1,724 మంది అమ్మాయిలు చదువుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా బాలికలు చదువుతున్న పాఠశాలగా ఎమ్మిగనూరు నిలిచింది. దీనికి సమీపంలోని బీసీ సంక్షేమ వసతిగృహం నుంచే సుమారు 500 మంది విద్యార్థినులు వస్తున్నారు. ఏటా 800 మందికి పైగా కొత్తగా ప్రవేశాలు పొందుతున్నారు. ఏ తరగతి చూసినా విద్యార్థినులతో కిక్కిరిసి కనిపిస్తోంది.
- బాలికలకు ప్రత్యేకంగా ఉండడంతో తల్లిదండ్రులు ఇక్కడ ప్రవేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పాఠశాలలోనూ అనేక సమస్యలు పిల్లలను వేధిస్తున్నాయి.
- ఎమ్మిగనూరు బాలికల ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల కొరత ఉంది వరుసలో నిల్చోవాల్సిన దుస్థితి నెలకొంది.
- 50 సెక్షన్లకు 50 తరగతి గదులు అవసరం కాగా.. ప్రస్తుతం 35 మాత్రమే ఉన్నాయి. అందులోనూ 18 శిథిలావస్థకు చేరాయి.
- గదుల కొరత కారణంగా చాలా తరగతుల్లో 70-80 మంది పిల్లల్ని కిక్కిరిసేలా కూర్చో బెడుతున్నారు.
- గత ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన 8 గదులను తరగతులకు వినియోగిస్తున్నారు.
15 తరగతులను వరండాలో చెట్ల కింద నిర్వహిస్తున్నారు. - ప్రత్యేక ల్యాబ్లు, గ్రంథాలయం కోసం మరిన్ని గదులు కావాలి. ప్రస్తుతం వీటిల్లోనూ తరగతులు నిర్వహిస్తున్నారు.
- భోజనశాల, వంటలు చేసేందుకు ప్రత్యేక గదుల కొరత ఉండడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.