Google Data Center Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ ముందడుగు పడబోతోంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నం వేదికగా తన డేటా సెంటర్ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ. 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం, పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్గా రికార్డు సృష్టించనుంది.
ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సుమారు 600 ఎకరాల భూమిని కేటాయించింది. అడవివరం, తర్లువాడ, రాంబిల్లి ప్రాంతాల్లో మూడు వేర్వేరు చోట్ల ఈ సెంటర్లను నిర్మించనున్నారు. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఈ భూమి పూజ కార్యక్రమానికి స్వయంగా హాజరవుతుండటం విశేషం. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలవనుంది.
సాంకేతికంగా ఈ డేటా సెంటర్ అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకోనుంది. గూగుల్ సెర్చ్, యూట్యూబ్, వర్క్స్పేస్ వంటి సేవలను మరింత వేగంగా అందించడానికి ఇక్కడ భారీ ల్యాండింగ్ స్టేషన్లు, సబ్మెరైన్ కేబుల్స్ మెట్రో ఫైబర్ లైన్లను ఏర్పాటు చేస్తారు. 2028 జూలై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టు అమలులో అదానీ ఇన్ఫ్రా కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రాజెక్టు అవసరాల కోసం అదానీ ఇన్ఫ్రా లిమిటెడ్ ఇప్పటికే మూడు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూములను సేకరించి ఇప్పటికే గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్కు అప్పగించింది. దీనివల్ల స్థానికంగా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు, ఐటీ రంగంలో వైజాగ్ రూపురేఖలు మారిపోనున్నాయి.
విశాఖను గ్లోబల్ ఐటీ హబ్గా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ గూగుల్ డేటా సెంటర్ ఒక పెద్ద బలాన్ని ఇవ్వనుంది. అమెరికా వెలుపల ఇంత పెద్ద ఎత్తున గూగుల్ పెట్టుబడులు పెట్టడం విశాఖపై ఆ సంస్థకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది.