బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి..
ఎవరికీ వర్తిస్తుంది… ఎవరికీ మినహాయింపు?
యూరప్కు వెళ్లే ప్రయాణికులకు ఇకపై కొత్త అనుభవం ఎదురుకానుంది. 2026 ఏప్రిల్ 10 నుంచి యూరోపియన్ యూనియన్ (EU) 29 దేశాల్లో పూర్తిగా డిజిటల్ ఆధారిత “ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టమ్ (EES)” అమలు చేయనుంది.
డిజిటల్ రికార్డు… బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి
ఇప్పటి వరకు పాస్పోర్ట్ స్టాంపింగ్ విధానం ఉండగా, ఇకపై ప్రయాణికుల ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలు పూర్తిగా డిజిటల్గా నమోదు అవుతాయి. ముఖ్యంగా యూరప్కు 90 రోజుల లోపు, టూరిజం లేదా వ్యాపార ప్రయాణం చేసే వారు ఈ విధానానికి లోబడి ఉంటారు.
ఈ సిస్టమ్లో భాగంగా ప్రయాణికుల ముఖ చిత్రం (ఫేస్ స్కాన్), వేలిముద్రలు (ఫింగర్ప్రింట్స్), పాస్పోర్ట్ వివరాలు నమోదు చేస్తారు.
ఎవరికీ వర్తిస్తుంది… ఎవరికీ మినహాయింపు?
ఈ నియమాలు యూరోపియన్ యూనియన్ లేదా షెంగెన్ ప్రాంత దేశాలకు వెలుపల నుండి వచ్చే ప్రయాణికులందరికీ వర్తిస్తాయి. వీసా లేకుండా ప్రయాణించే వారికీ ఇది తప్పనిసరి.
అయితే ఐర్లాండ్, సైప్రస్ దేశాలు మాత్రం ఈ సిస్టమ్లో భాగం కావు. అక్కడ పాత మాన్యువల్ విధానం కొనసాగుతుంది.
ఇక EU, షెంగెన్ దేశాల పౌరులు, దీర్ఘకాల వీసాలు లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారికి ఈ సిస్టమ్ వర్తించదు. అలాగే ట్రాన్స్పోర్ట్ సిబ్బంది, సైనికులు, కొంతమంది సరిహద్దు ప్రాంత నివాసితులకు మినహాయింపులు ఉన్నాయి.
ఈ డిజిటల్ విధానం ప్రధానంగా భద్రత పెంచడం, మోసాలను తగ్గించడం కోసం తీసుకొచ్చినదని సంబందిత అధికారులు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ నుండి దశలవారీగా అమలు ప్రారంభమైందని, ఇప్పటివరకు 24,000 మందికి పైగా ప్రయాణికులకు ఎంట్రీ నిరాకరించినట్లు సమాచారం.
అందులో చెల్లని పత్రాలు, సరైన కారణాలు లేకపోవడం ప్రధాన కారణాలు కాగా, 600 మందికి పైగా వ్యక్తులను భద్రతా ముప్పుగా గుర్తించారు.
కొత్త విధానం ప్రారంభ దశలో ఎయిర్పోర్ట్లలో కొంత ఆలస్యం జరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ కారణంగా సమయం ఎక్కువ పట్టవచ్చు.
బయోమెట్రిక్ పాస్పోర్ట్ ఉన్నవారు సెల్ఫ్-సర్వీస్ కియోస్క్ల ద్వారా వేగంగా క్లియరెన్స్ పొందవచ్చు. ఇతరులు మాత్రం అధికారుల వద్ద చెకింగ్ చేయించుకోవాలని వెల్లడించారు.
12 ఏళ్ల లోపు పిల్లలకు వేలిముద్రలు అవసరం లేదు కానీ ఫోటో మాత్రం తప్పనిసరిగా తీసుకుంటారు. బయోమెట్రిక్ వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన వారికి ప్రవేశం నిరాకరించబడుతుంది.
ప్రయాణికులకు సులభతరం చేయడానికి EU “ట్రావెల్ టు యూరప్” అనే మొబైల్ యాప్ను కొన్ని దేశాల్లో ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు ముందుగానే (72 గంటల ముందు) తమ పాస్పోర్ట్ వివరాలు, ఫోటోను అప్లోడ్ చేయవచ్చు. అయితే తుది తనిఖీలు మాత్రం ఎయిర్పోర్ట్లోనే జరుగుతాయి.
యూరప్ ప్రయాణంలో ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పవచ్చు. భద్రత, పారదర్శకత పెరుగుతాయని భావిస్తున్నప్పటికీ, ప్రారంభ దశలో ప్రయాణికులు అదనపు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ముందస్తుగా ప్రణాళిక చేసుకుంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది.