వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి..
పెద్ద దస్తగిరి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదు జగన్?
మంగళగిరి: కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో భాగంగానే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆయన అన్నారు.
రెండు వారాల క్రితం కడప పట్టణంలో జరిగిన ఈ హత్యను కొంతమంది మాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే ఈ హత్య కూడా జరిగిందని పోల్చారు. “మొదట గుండెపోటు అని చెప్పి, తరువాత గొడ్డలి దాడి జరిగినట్టు చెప్పినట్లే... ఇప్పుడు కూడా నిజాలను మసకబార్చే ప్రయత్నం జరుగుతోంది” అని విమర్శించారు.
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆస్తుల వ్యవహారంలోనే ఈ హత్య జరిగిందని ఆయన పేర్కొన్నారు. కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డికి బినామీగా పని చేస్తూ పెద్ద స్థాయిలో భూ దందాలు చేశారని ఆరోపించారు. పెద్ద దస్తగిరి పేరుతో వందల కోట్ల ఆస్తులు పెట్టి, ఆ లావాదేవీలలో తలెత్తిన వివాదాల వల్లే ఈ హత్య జరిగిందని చెప్పారు.
ఈ ఘటనపై వైసీపీ నేతలు సరైన స్పందన ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. “ఇతరులు చనిపోతే వెంటనే పరామర్శించే జగన్... పులివెందులలో ఉండి కూడా పెద్ద దస్తగిరి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదు?” అని నిలదీశారు. హత్యను ఖండించకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రవీంద్రనాథ్ రెడ్డికి ఎలాంటి వ్యాపారాలు లేకపోయినా వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాయలసీమకు నీళ్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన పనులను కూడా భూమిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. 2020లో రూ.3,885 కోట్లతో లిఫ్ట్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి, పర్యావరణ అనుమతులు లేకుండానే టెండర్లు ఇచ్చారని అన్నారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీకి ఈ పనులు అప్పగించారని ఆరోపించారు.
తరువాత నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఈ ప్రాజెక్టుపై స్టే ఇచ్చినా కూడా రూ.900 కోట్ల బిల్లులు డ్రా చేసుకున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఎన్జీటీ రూ.2.65 కోట్ల జరిమానా కూడా విధించిందని గుర్తు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అసలు లక్ష్యం రాయలసీమకు నీళ్లు ఇవ్వడం కాదని, చెన్నైకి తాగునీరు అందించడమేనని ఆరోపించారు. ఈ విషయాన్ని 2023లో జీఓల ద్వారా స్పష్టం చేశారని తెలిపారు.
రాయలసీమకు జరిగిన అన్యాయంపై భూమిరెడ్డి తీవ్రంగా స్పందించారు. “2019-24 మధ్య ఒక ఆయకట్టుకైనా అదనంగా నీరు ఇచ్చినట్టు నిరూపిస్తే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను” అని సవాల్ విసిరారు. అలాగే, వేదవతి, గుండ్రేవుల వంటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, మొత్తం 102 సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసిందని ఆరోపించారు. ఇది రాయలసీమకు చేసిన తీరని ద్రోహమని వ్యాఖ్యానించారు.
పెద్ద దస్తగిరి హత్య, భూ దందాలు, రాయలసీమ నీటి సమస్యలపై భూమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.