AP Housing Projects: వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల రాజకీయాల్లో ఇప్పుడు పెను మార్పులు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ 'మా నాయకుడు' అని గుండెల్లో పెట్టుకున్న ప్రజలే, ఇప్పుడు జగన్ బంధువుల అక్రమాలపై గళమెత్తుతున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు కావడం ఒక ఎత్తు అయితే, ఏకంగా భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ ముందే స్థానిక ప్రజలు శాపనార్థాలు పెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సొంత గడ్డపైనే ప్రజలు ఎదురు తిరుగుతుండటంతో వైకాపా శ్రేణుల్లో గుబులు మొదలైంది.
పులివెందులలోని జగనన్న కాలనీల నిర్మాణం అట్టడుగున పడిపోవడమే ఈ ఆగ్రహానికి ప్రధాన కారణం. పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి, ఆ కాంట్రాక్టులను తమకు కావాల్సిన 'రాక్రీట్' సంస్థకు కట్టబెట్టారు. ఈ సంస్థ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి బంధువులది కావడం, వారికి భూమన కుటుంబంతో విడదీయలేని సంబంధాలు ఉండటం గమనార్హం. ఎటువంటి రివర్స్ టెండర్లు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి సుమారు 1,100 కోట్ల రూపాయల విలువైన 63 వేల ఇళ్ల నిర్మాణాన్ని ఈ 'చుట్టాల' కంపెనీకి అప్పగించారు. కానీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం నాసిరకంగా సాగుతూ ప్రజలను వంచించాయి.
ఈ వ్యవహారంలో జరిగిన భారీ అవకతవకలపై ప్రస్తుతం విజిలెన్స్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పనులు పూర్తి కాకముందే పూర్తి అయినట్లు రికార్డులు సృష్టించి, సుమారు 80 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అక్రమాలను గుర్తించి నిధులను నిలిపివేసింది. దీంతో అడ్డంగా దొరికిపోయిన సదరు సంస్థ, కోర్టుకు వెళ్లి పనులను అడ్డుకుంటోంది. పేదల సొంతింటి కలను ఈ చుట్టాల కంపెనీలు కాలరాస్తుంటే, అటు జగన్ గానీ, ఇటు పార్టీ నేతలు గానీ పట్టించుకోకపోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.
ఇదే సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని, అందుకే సంస్థ కోర్టుకు వెళ్లిందని ఆయన చెప్పడం చూస్తుంటే.. వివేకా హత్య కేసులో ఆయన ఎలాగైతే అమాయకత్వం ప్రదర్శించారో, ఇక్కడ కూడా అదే డ్రామా ఆడుతున్నారని జనం విమర్శిస్తున్నారు. ఒక పక్క తిరుమల పరకామణి నుంచి కల్తీల వరకు అన్నింటా ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమన బంధువులు, మరోపక్క పేదల పొట్ట కొట్టిన రాక్రీట్ సంస్థ.. అంతా కలిసి రాబందుల్లా పులివెందుల ప్రజలను దోచుకున్నారని కడప జనం అసహ్యించుకుంటున్నారు.
సొంత భార్య పేరిట ఉన్న భారతీ సిమెంట్స్కు కెపాసిటీకి మించి ఆర్డర్లు ఇప్పించుకోవడం, కాంట్రాక్టులన్నీ బంధువులకే కట్టబెట్టడం వంటి చర్యలతో జగన్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. పేదవాడి ఇంటి స్థలం నుంచి దేవుడి కొండ వరకు దేన్నీ వదలకుండా దోచుకుని, ఇప్పుడు విమానాల్లో తిరుగుతూ ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉంది. అందుకే ఇప్పుడు పులివెందుల పులిలా తిరగబడింది. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని బాధితులు ధైర్యంగా పోలీసు స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు.