- గత పదేళ్లుగా దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నాం..
- కల్తీ జరగలేదని చెప్పడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలి, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు..
Nara Lokesg Comments On YCP: దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం ఉంది. గత పదేళ్లుగా దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నాం. అలాంటి మాపై ఆరోపణలు చేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. నెయ్యి కల్తీ అంశంపై శాసనమండలిలో చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ హెరిటేజ్ డెయిరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ సభ్యుల ఆరోపణలపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఆరోపణలు చేయాలంటే ఆధారాలతో సభకు రావాలి. గత పదేళ్లుగా మా బాబు పుట్టినరోజు మార్చి 21 తిరుమలలో అన్నదానం చేస్తున్నాం. అలాంటి మాపై ఆరోపణలు చేస్తున్నారు. టెండర్ లో ఎల్-3 వస్తే రాదు.. ఎల్-1 వారికి మాత్రమే వస్తుంది. కామన్ సెన్స్ ఉండాలి. లడ్డూలో కల్తీ అంశం తప్ప వైసీపీ సభ్యులు అన్నీ మాట్లాడతారు. సీబీఐ ఇచ్చిన రిపోర్ట్ లో కల్తీ జరిగిందని చాలా స్పష్టంగా చెప్పింది. వైవీ సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. ఇప్పుడు నెయ్యి మార్కెట్ ధర పెరిగింది.
కల్తీ చేసి రూ.300కి నెయ్యి సప్లై చేయమంటారా? వైసీపీ కల్తీ చేసినట్లు చేయమంటారా? మార్కెట్ ప్రైస్ ఎంతుందో ఈ రోజు కామన్ సెన్స్ తో గూగుల్ లో చెక్ చేసుకోవచ్చు. కావాలని ఆరోపణలు చేస్తున్నారు. దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం. మాకు రైట్ ఉన్నా తిరుమలలో ఏనాడూ ముఖద్వారం నుంచి వెళ్లలేదు. క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లిన ఘనత మాది. మీ నాయకుడు జగన్ రెడ్డి డిక్లరేషన్ పై కనీసం సంతకం పెట్టలేదు. మీరా మాట్లాడేది అంటూ నిలదీశారు. కల్తీ జరగలేదని చెప్పడానికి సిగ్గుండాలని, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడని మండిపడ్డారు.