- Politics: తీర ప్రాంతంలో పెరగనున్న భద్రత: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం..
- "వేట సాఫీగా సాగాల్సిందే": ఇతర రాష్ట్రాల బోట్ల చొరబాటుపై చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
Andhrapradesh Chandrababu: ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లో మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి బోట్లు అక్రమంగా ఏపీ జలాల్లోకి చొరబడటం వల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వెంటనే 4 అత్యాధునిక హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల నుంచి సూళ్లూరుపేట వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేయాలని, ఇతర రాష్ట్రాల బోట్ల చొరబాట్లను అడ్డుకునేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై జరిగిన సమీక్షలో కావలి ప్రాంత మత్స్యకారుల భూ సమస్యను పార్టీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, మత్స్యకారుల భూములకు సంబంధించి దళారుల జోక్యం లేకుండా చూడాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి వేట సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.