- వార్డెన్ ల పనితీరు, హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో సంతృప్తి శాతం పెరగాలి..
- ఉమ్మడి ప్రకాశం జిల్లా సోషల్ వెల్ఫేర్ ASWO లతో మంత్రి డా.స్వామి సమీక్ష..
Minister Veeranjaneya Speech: పదవ తరగతి పరీక్షల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్రతి విద్యార్థి పాసవ్వాలని అన్ని హాస్టళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా సోషల్ వెల్ఫేర్ ASWO లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...10 పరీక్షల్లో అన్ని హాస్టళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి, అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపొందించి విద్యార్థులను సన్నద్ధం చేయాలి. విద్యార్థులకు వార్డెన్ లు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి.
మెనూ, వార్డెన్ ల పనితీరు, పారిశుద్ధ్య నిర్వహణపై ఐవిఆర్ఎస్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాం. విద్యార్థుల సంతృప్తి పెంపే లక్ష్యంగా వార్డెన్ల పనితీరు, పారిశుధ్య నిర్వహణ ఉండాలి. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతిరోజు తప్పనిసరిగా మెనూ ప్రకారం భోజనం అందించాలి, దీనిలో రాజీ పడితే ఉపేక్షించేదిలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా శానిటేషన్ వర్కర్స్ నియమిస్తున్నాం. అన్ని హాస్టల్లలో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పీఎం అజయ్ కింద రాష్ట్రంలో 26 నూతన హాస్టళ్లు నిర్మిస్తున్నామని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ సమీక్షలో జిల్లా సోషల్ వెల్ఫేర్ డిడి ఎం. లక్ష్మ నాయక్, ఉమ్మడి జిల్లా ASWO లు పాల్గొన్నారు.