PDS Supply Updates: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న వేళ రేషన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెల నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజలు పదే పదే రేషన్ షాపుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకేసారి మూడు నెలల కోటాను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
సాధారణంగా ఏ నెలకు సంబంధించిన బియ్యాన్ని ఆ నెలలోనే పంపిణీ చేస్తారు. అయితే, ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, సామాన్యులు ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఎండలో ఇబ్బంది పడకుండా ఉండాలని కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ నెలలోనే ఏప్రిల్, మే జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు దారులకు 'సన్నబియ్యం' పంపిణీని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో, ఇప్పుడు ఒక్కో వ్యక్తికి ఏప్రిల్ నెలలోనే ఏకంగా 18 కిలోల బియ్యం అందే అవకాశం ఉంది. దీనివల్ల నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.
మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడం వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయని, డీలర్లకు కూడా పని భారం తగ్గుతుందని భావిస్తున్నప్పటికీ.. కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఇలాగే పంపిణీ చేసినప్పుడు సర్వర్లు మొరాయించాయి. ఒక్కో కార్డుపై మూడు సార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి రావడం, సర్వర్ స్లోగా ఉండటం వల్ల ఒక్కో కుటుంబానికి రేషన్ ఇవ్వడానికి 20 నిమిషాల వరకు సమయం పడుతోంది. దీనికి తోడు, అంత పెద్ద మొత్తంలో బియ్యాన్ని నిల్వ ఉంచే సామర్థ్యం తమ షాపుల్లో లేదని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.