ఎంఎస్ఎంఈలే దేశ ఆర్థిక వెన్నెముక…
బయోఫార్మా పరిశోధనలకు జాతీయ స్థాయి ప్రోత్సాహం..
ఆంధ్రప్రదేశ్కు రేర్ ఎర్త్ మినరల్స్లో కీలక పాత్ర….
పవిత్ర మాఘపౌర్ణిమ శుభ సందర్భాన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక ప్రయాణం అత్యంత స్థిరంగా సాగుతోందని పేర్కొంటూ, భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇది కర్తవ్య భవన్లో రూపొందించిన మూడో బడ్జెట్ అని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా దీనిని తీర్చిదిద్దామని ఆమె వెల్లడించారు.
ఈ బడ్జెట్లో యువశక్తి, నైపుణ్యం మరియు ఉత్పాదకతకు పెద్దపీట వేశారు. భారత దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో యువతకు ఉపాధి కల్పన, వారి నైపుణ్యాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' మంత్రంతో సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా రైతులు, దళిత మరియు గిరిజన సమూహాలకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వివరించారు.
ఆర్థిక సుస్థిరత కోసం ప్రభుత్వం ఆరు కీలక రంగాల్లో సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా 2025 ఆగస్టు తర్వాత సుమారు 350 సంస్కరణలను తీసుకువచ్చినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. జీఎస్టీ వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, లేబర్ కోడ్లో మార్పులు వంటి చర్యల ద్వారా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఆర్థిక ప్రణాళికలపై ఉన్నప్పటికీ, భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
పరిశ్రమల వృద్ధి కోసం ఎంఎస్ఎంఈ (MSME) రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. 'ఛాంపియన్ ఎంఎస్ఎంఈ'ల కోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. అలాగే, వచ్చే ఐదేళ్ల కాలానికి గాను రూ.10 వేల కోట్లతో 'బయోఫార్మా శక్తి' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఫార్మా రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయి విద్యాసంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
టెక్నాలజీ రంగంలో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు 'ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0' ను ప్రారంభిస్తూ, దీని కోసం రూ. 40 వేల కోట్లు కేటాయించారు. ఇది ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. అలాగే, రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణ కోసం ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఖనిజ సంపద వినియోగానికి ప్రభుత్వం సిద్ధమైంది.