- ప్రశ్నపత్రాల్లో తప్పులు.. విద్యార్థులకు మార్కుల పంట: ఆంగ్లంలో 4, హిందీలో 2 మార్కులు యాడ్..
- Politics: ఏప్రిల్ నెలలోనే పది, ఇంటర్ ఫలితాలు: పది రోజుల వ్యవధిలో రిజల్ట్స్ విడుదలకు కసరత్తు..
AP Govt: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ సబ్జెక్టుకు రెండు మార్కులు, ఆంగ్ల సబ్జెక్టుకు నాలుగు మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. హిందీ పేపర్లో ప్రశ్నలు 3, 6 బిట్లలో కింద ఇచ్చిన ఐచ్చికాల్లో అక్షర దోషాలు ఉన్నందున ఒక్కో మార్కు చొప్పున రెండు మార్కులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. విద్యార్థులు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉండాలని, సమాధానం తప్పైనా మార్కులు ఇస్తామని చెప్పారు. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆంగ్ల భాష సబ్జెక్టు ప్రశ్నపత్రంలో 28వ ప్రశ్న పాఠ్యపుస్తకం నుంచి కాకుండా వర్క్ బుక్ నుంచి ఇచ్చారు. అండరైన్ చేసిన నాలుగు పదాలకు వ్యతిరేక పదాలు రాయాలంటూ నాలుగు మార్కుల ప్రశ్న ఇచ్చారు. బ్లూప్రింట్కు వ్యతిరేకంగా ఇచ్చారంటూ ఫిర్యాదులు రావడంతో సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఈ ప్రశ్నకు ఎలాంటి జవాబు రాసినా నాలుగు మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు సబ్జెక్టులకు ఆరు మార్కులు కలపాలనే సమాచారాన్ని జిల్లా విద్యాధికారులకు పంపించారు. ఈ నెల 6 నుంచి పదో తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది.
ఈ నెలలోనే పది, ఇంటర్ ఫలితాలు..
ఈ ఏడాది ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనున్నారు. పది రోజుల తేడాతో ఇవి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం 9న ముగుస్తుంది. తర్వాత ఫలితాల విడుదల ప్రక్రియకు ఐదు నుంచి ఆరు రోజులు పడుతుంది. దీంతో ఫలితాలను ఈ నెల మూడో వారంలో (15వ తేదీ తర్వాత) విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది.
పదో తరగతి ఫలితాలను ఈ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. మూల్యాంకనం 6 నుంచి 15 వరకు సాగుతుంది. ఫలితాలను ప్రాసెస్ చేయడానికి 8 నుంచి 10 రోజులు పడుతుంది. ఇది పూర్తి కాగానే (25వ తేదీ తర్వాత) ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తోంది.