విమానాల ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వాలిడేషన్ సర్టిఫికేషన్ కోసం ఏర్పాటుకానున్న టెస్టింగ్ సెంటర్..
నేడు ఏపీలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన..
పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్లో రక్షణ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధికి నేడు కీలక ముందడుగు పడనుంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర పర్యటనకు రానుండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో కలిసి పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏరోస్పేస్, డిఫెన్స్ ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమంలో ఇద్దరు నేతలు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు శంకుస్థాపన జరగనుంది. ఈ కేంద్రంలో భవిష్యత్తులో విమానాల ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వాలిడేషన్, సర్టిఫికేషన్ వంటి కీలక కార్యకలాపాలు నిర్వహించనున్నారు. దేశీయ రక్షణ సాంకేతిక సామర్థ్యాన్ని పెంచే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.
అలాగే అనకాపల్లి జిల్లా టి. సిరసపల్లిలో ఏర్పాటు కానున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) యూనిట్కు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ కాంప్లెక్స్లో అధునాతన జలాంతర్గామి ఆయుధ వ్యవస్థలను తయారు చేయనుండగా, భారత నౌకాదళ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు.
ఇక కర్నూలులో అభివృద్ధి చెందుతున్న డ్రోన్ సిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కూడా నేడు శంకుస్థాపనలు జరగనున్నాయి. డ్రోన్ టెక్నాలజీ, రక్షణ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు రాష్ట్రానికి కొత్త అవకాశాలను తీసుకురానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సందర్భంగా రక్షణశాఖకు చెందిన పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. రాష్ట్రాన్ని దేశంలోనే కీలక డిఫెన్స్, ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అధికారులు పేర్కొన్నారు.
రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాజెక్టులు భారీ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా దోహదపడనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.